
ముంబై: మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) బ్యాంకులకు రూ.8,300 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనట్టు తెలిపింది. ఈ టెలికం సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులకు బకాయిలను తిరిగి చెల్లించలేకపోయింది.
మార్చి నెలలో అసలు, వడ్డీ చెల్లింపులను ఎగవేసింది. అసలు మొత్తం రూ.7,794.34 కోట్లు కాగా, వడ్డీ బకాయిలు రూ.551.90 కోట్లు ఉన్నాయి. జరిమానాలు, చార్జీలను కలుపుకొని డిఫాల్ట్ మొత్తం రూ.8,346.24 కోట్లకు చేరుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎంటీఎన్ఎల్ రూ. 3,633 కోట్లకు పైగా బకాయిపడింది. తరువాత స్థానాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ. 2,374 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 1,077 కోట్లు) ఉన్నాయి.