
ములుగు, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ సంబంధిత అదికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంభించాల్సిన విధానాలపై ఆర్డీవో వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ తో కలసి జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి పోలీసు, రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ఆర్టీవో, ఆర్టీసీ, తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 163 హైవేపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్ , జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.