
వడోదరా: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. చిన్న టార్గెట్ ఛేజింగ్లో సివర్ బ్రంట్ (57) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 120 రన్స్కే ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (32) టాప్ స్కోరర్. స్టార్టింగ్ నుంచే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టాపార్డర్ తడబడింది.
బెత్ మూనీ (1), లారా వోల్వర్త్ (4), హేమలత (9), ఆష్లే గార్డ్నర్ (10) నిరాశపర్చడంతో గుజరాత్ 28/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో హర్లీన్ ఒంటరి పోరాటం చేయడంతో ఆమాత్రం స్కోరైనా వచ్చింది. మిడిలార్డర్లో దియోంద్ర డాటిన్ (7) ఫెయిలైనా, సిమ్రాన్ షేక్ (3) ఫెయిలైనా, కశ్వీ గౌతమ్ (20) మెరుగ్గా ఆడింది. చివర్లో తనుజా కన్వర్ (13), సయాలీ (13) ఫర్వాలేదనిపించారు. హేలీ మాథ్యూస్ 3, సివర్ బ్రంట్, అమెలియా కెర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ముంబై 16.1 ఓవర్లలో 122/5 స్కోరు చేసింది. అమెలియా కెర్ (19), హేలీ మాథ్యూస్ (17), సజన (10 నాటౌట్) మెరుగ్గా ఆడారు. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హేలీ మాథ్యూస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ, యూపీ తలపడతాయి.