![ఫేవరెట్గా ముంబై.. నేటి నుంచి హర్యానాతో రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్](https://static.v6velugu.com/uploads/2025/02/mumbai-takes-on-haryana-in-ranji-trophy-quarter-finals-suryakumar-yadav-and-shivam-dubey-in-focus_pWdnuiHIkG.jpg)
- బరిలో సూర్యకుమార్, శివం దూబే
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్–18, జియో సినిమాలో లైవ్
కోల్కతా: రంజీ ట్రోఫీ చరిత్రలో 43వ టైటిల్పై కన్నేసిన ముంబై నాకౌట్ ఫైట్కు రెడీ అయ్యింది. శనివారం నుంచి హర్యానాతో జరిగే క్వార్టర్ ఫైనల్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హర్యానాలోని లాహ్లిలో జరగాల్సి ఉన్నా ముందస్తు సమాచారం లేకుండా ఈడెన్కు తరలించారు. దీంతో ఇరుజట్ల ప్రాక్టీస్ కాస్త గందరగోళంలో పడింది. సొంతగడ్డపై ఆడటం తమకు కలిసొస్తుందని భావించిన హర్యానాకు ఇది ఎదురుదెబ్బే అనొచ్చు. ఇక ఎలాంటి మ్యాచ్నైనా ప్రొఫెషనల్గా ఆడే ముంబై ఈ పోరు కోసం కూడా పక్కగా రెడీ అయ్యింది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్, ఆల్రౌండర్ శివమ్ దూబే రాకతో బ్యాటింగ్ బలం రెట్టింపైంది. దాంతో పాటు ఆఖరి లీగ్ మ్యాచ్లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 రన్స్ తేడాతో గెలవడం కూడా టీమ్లో మంచి కాన్ఫిడెన్స్ను నింపింది. ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, శామ్స్ ములానీతో పాటు రహానె కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే తుది జట్టులో సూర్య, దూబేను ఎక్కడ అడ్జస్ట్ చేస్తారన్న సందిగ్ధత కొనసాగుతోంది.
పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్లో దుమ్మురేపుతున్నాడు. వీళ్లందర్ని కొనసాగించాలంటే ఓపెనర్లు ఆయుష్ మాత్రే, అమోఘ్ భత్కల్, సుయాన్ష్ షెడ్జేను తప్పించాల్సి ఉంటుంది. మరోవైపు హర్యానాను కూడా తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యోగేందర్ సింగ్తో కూడిన బ్యాటింగ్ బలం వాళ్లకు కొండంత అండ. అన్షుల్ కాంబోజ్, అనుజ్ థాక్రల్, జయంత్ యాదవ్ బౌలింగ్లో రాణిస్తున్నారు.
విదర్భతో తమిళనాడు ఢీ
నాగ్పూర్లో జరిగే మరో క్వార్టర్స్లో తమిళనాడుతో విదర్భ తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు నెగ్గిన విదర్భ 40 పాయింట్లు సాధించి నాకౌట్లోకి అడుగుపెట్టింది. గ్రూప్–డి టాపర్ తమిళనాడు కూడా బలంగా ఉంది. విదర్భ జట్టులో కెప్టెన్ కరుణ్ నాయర్ సూపర్ ఫామ్లో ఉండగా.. తమిళనాడులో జగదీశన్, బాబా ఇంద్రజిత్, విజయ్ శంకర్ రాణిస్తున్నారు. ఇతర మ్యాచ్ల్లో సౌరాష్ట్రతో గుజరాత్, జమ్ము కశ్మీర్తో కేరళ తలపడతాయి.