
- నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి
- రూ.181 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
- సాయంత్రం సెయింట్ గాబ్రియల్ స్కూల్లో బహిరంగ సభ
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ బాస్కర్.
వరంగల్, వెలుగు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. ఉదయం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి మధ్యాహ్నం 2.45 గంటలకు హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని కిట్స్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ఎగ్జిబిషన్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు బాలాజీ గార్డెన్స్లో కేసీఆర్ క్రికెట్ కప్ను బహూకరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ను ఓపెన్ చేస్తారు.
5 గంటలకు మర్కజీ స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని సైన్స్ పార్క్ను ప్రారంభించనున్నారు. 5.30 గంటలకు రంగశాయిపేట వద్ద బీఆర్ఎస్ వరంగల్ జిల్లా ఆఫీస్కు శంకుస్థాపన చేసి, 6.15 గంటలకు హనుమకొండ టీవీ టవర్ ఏరియాలోని వైకుంఠధామాన్ని ఓపెన్ చేస్తారు. అనంతరం 6.30 గంటలకు కాజీపేట సెయింట్ గాబ్రియల్ స్కూల్ ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, 8 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. మొత్తం పర్యటనలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలో రూ.181.45 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, చీఫ్ విప్
మంత్రి కేటీఆర్ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట, తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వికలాంగుల అభివృద్ధి సంస్ధ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితోపాటు వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు, వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని సూచించారు.