ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  

ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  
  •     ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  

చండూరు ( మర్రిగూడ) వెలుగు : చర్లగూడెం ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దని, అండగా ఉంటానని భూ నిర్వాసితులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం మర్రిగూడ మండలం చర్లగూడెం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులను కలిసి మాట్లాడారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండానే ప్రాజెక్టు మొదలుపెట్టిన కేసీఆర్ తొందరపాటు చర్యల వల్ల నిర్వాసితులు రోడ్డున పడ్డారన్నారు. చర్లగూడెం ప్రాజెక్టు అనేది గత ప్రభుత్వం చేసిన తొందరపాటు వల్ల భూ నిర్వాసితులు ముంపు గ్రామస్తులు రోడ్డున పడ్డారని చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లా ఏదుల ప్రాజెక్టు పూర్తి అయితేనే, ఇక్కడికి నీళ్లు వస్తాయని కానీ, ఇప్పటివరకు అక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చర్లగూడ ప్రాజెక్టు కోసం రూ.6000 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పుడు పనులు ఆపాలంటూ నిర్వాసితులు అడ్డుకున్నారని, 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టు పనులను అడ్డుకోవడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. నిర్వాసితులకు పునరావాసానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇబ్రహీంపట్నంలో లేదంటే చింతపల్లి, మర్రిగూడ మండలంలో ఇప్పిస్తానని, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేసే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.