
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్
- బీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర
- రాజేశ్వర్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
- ఉద్యమంలో పల్లా ఎక్కడున్నడని నిలదీత
- అర్ధనగ్న ప్రదర్శనతో ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దురాగతాలపై సీఎం కేసీఆర్ ఎంక్వైరీ చేయించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో తన అనుచరులు నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.
జనగామ, వెలుగు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దురాగతాలపై సీఎం కేసీఆర్ ఎంక్వైరీ చేయించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. బీబీనగర్ ప్రాంతానికి చెందిన 286 మంది ప్లాట్లను కొడుకు అనురాగ్ రెడ్డి పేరిట కబ్జాచేసిన పల్లాపై ఈడీతో విచారణ జరపాలని, ఈ మేరకు బాధితులు డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పల్లా అనుచరుల ఆగడాలకు నిరనసగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో బీఆర్ఎస్ పార్టీ దళిత నేతలు శనివారం చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనకు ముత్తిరెడ్డి హాజరై మాట్లాడారు. నాడు ఆంధ్రోళ్లను తరిమికొట్టేందుకు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే నేడు ఎమ్మెల్సీ పల్లా దుర్మార్గాలపై చేయాల్సి రావడం దౌర్భాగ్యం అన్నారు. పల్లా కొడుకు అనురాగ్ రెడ్డి పేరిట ఉన్న భూములు బాధితులు 286 మందికే చెందుతాయని తహసీల్దార్ కూడా చెప్పారని పేర్కొన్నారు. అధికార బలంతో పల్లా పేదల పొట్టగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పల్లాకు చిత్తశుద్ధి ఉంటే 286 మందికి భూమిని తిరిగి ఇచ్చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. దళితులను జైల్లో పెట్టించడం అమానుషమన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఆపద తీర్చాలి తప్ప ఆపద తేకూడదన్నారు. ‘‘చేర్యాలలో కలెక్టర్ స్వయంగా పట్టా భూమి అని చెప్పినా నా బిడ్డను తప్పుదోవ పట్టించిన కుట్ర పల్లా రాజేశ్వర్ రెడ్డిదే. నా బిడ్డ ఆ భూమిని దానం చేస్తా అంటే స్వాగతించిన. పల్లా కుట్రలో నా బిడ్డ సమిధ అయింది. పల్లా దుర్మార్గాలపై ప్రజా కోర్టులో శిక్ష తప్పదు” అని ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పల్లా కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు..