భారత్తో నాకున్న సమస్య సుంకాలే.. త్వరలోనే తగ్గిస్తుందని ఆశిస్తున్నా: ట్రంప్

భారత్తో నాకున్న సమస్య సుంకాలే.. త్వరలోనే తగ్గిస్తుందని ఆశిస్తున్నా: ట్రంప్
  • మోదీ చాలా తెలివైన వ్యక్తి
  • మేమిద్దరం మంచి స్నేహితులం
  • ప్రపంచంలోనే భారత్​ అధికంగా టారిఫ్ ​విధించే దేశాల్లో ఒకటి
  • త్వరలోనే  సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నా అంటూ కామెంట్స్​

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​ ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన గ్రేట్​ ప్రైమ్​ మినిస్టర్​ అంటూ కితాబిచ్చారు. శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్​ సమధానమిచ్చారు. ‘భారత ప్రధాని మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరుదేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా” అని పేర్కొన్నారు.

భారత్​తో నాకున్న సమస్య సుంకాలే

భారత ప్రజలకు గొప్ప ప్రధాని ఉన్నారని డొనాల్డ్​ ట్రంప్​ పేర్కొన్నారు. ‘‘భారత్​తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య టారిఫ్​లే. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటి. అయితే, ఇటీవల జరిపిన చర్చలకు అనుగుణంగా వాటిని భారత్​ భారీగా తగ్గిస్తుందని నమ్ముతున్నా.  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 2న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలుచేస్తే .. నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా’’ అని ట్రంప్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.

  అమెరికాలోకి ప్రవేశించే అన్ని దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం టారిఫ్​ను ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్​నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి  రానున్న ఈ సుంకాలు.. విదేశాల్లో అసెంబుల్ చేసిన అమెరికన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లతో సహా అమెరికాలో దాదాపు సగం వాహనాల సేల్స్ పై ప్రభావం చూపుతాయి.