
మైసూరు: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. మైసూరు సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతులను చేతన్ (45), అతని భార్య రూపాలి (43), వారి కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (62)గా పోలీసులు గుర్తించారు. చేతన్.. తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి.. వారు చనిపోయిన తర్వాత అతడు ఉరి వేసుకుని చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మైసూరు సిటీలోని విశ్వేశ్వరయ్య నగర్లో గల విద్యారణ్యపుర పరిధిలోని సంకల్ప్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో చేతన్, అతని భార్య, కుమారుడు, మరో ఫ్లాట్లో చేతన్తల్లి నివసిస్తున్నారు. చేతన్.. సోమవారం అమెరికాలో ఉన్న తన సోదరుడికి ఫోన్ చేసి.. తాము గత కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీంతో కుటుంబ సభ్యులమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. ఆ తర్వాత భరత్ఎన్నిసార్లు ఫోన్ చేసినా చేతన్ లిఫ్ట్చేయలేదు. దీంతో అతడు మైసూరులో ఉండే.. రూపాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
వారు వెంటనే అపార్ట్మెంట్కు వెళ్లగా అప్పటికే చేతన్ కుటుంబం మొత్తం చనిపోయారు. చేతన్ఉరివేసుకొని చనిపోగా.. అతని భార్య, కుమారుడు గొంతుకోయడం వల్ల చనిపోయినట్లు మృతదేహాలను చూసి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పక్క ఫ్లాట్లోని అతని తల్లి కూడా చనిపోయిందని, ఆమె కూడా గొంతుకోయడం వల్లే చనిపోయిందని చెప్పారు. చేతన్ ఒక మెకానికల్ ఇంజనీర్ అని, కొంతకాలం దుబాయ్లో పనిచేసి 2019లో మైసూరుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడు ఓ కన్సల్టెన్సీని నిర్వహిస్తూ.. సౌదీకి కార్మికులను పంపేవాడని పోలీసులు చెప్పారు.
వారిని ఎవరైనా హత్య చేశారా? లేదా చేతన్.. మిగిలిన ముగ్గురి హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్వచ్చిన తర్వాత తెలుస్తుందని మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ తెలిపారు. కాగా, ఆదివారం నలుగురు కుటుంబ సభ్యులు గోరూర్లోని ఆలయానికి వెళ్లి.. మైసూర్లోని కువెంపు నగర్లో గల చేతన్ అత్తమామల ఇంట్లో భోజనం చేసి వచ్చారని పోలీస్ కమిషనర్ సీమా తెలిపారు.