మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు

మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ పిటిషన్‎లో కోరారు. నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎన్ కన్వెన్షన్ విషయంలో సమంతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. 

కొండా సురేఖ వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్‎లో తీవ్ర దుమారం రేపాయి. అక్కినేని కుటుంబం కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. సమంతకు, అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు. తమ కుటుంబపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాగార్జున.. కొండా సురేఖ ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పినప్పటికీ మొత్తబడలేదు. ఈ క్రమంలోనే కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.