
లింగాల, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణ కు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అన్నారు. బుధవారం లింగాల మండల కేంద్రంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు 70 మంది పోలీసులు ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీలు చేశారు. సరైన డాక్యుమెంట్ల లేని 35 బైక్లు, 2 జీపులు, ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనదారులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, లింగాల, బల్మూర్, అచ్చంపేట ఎస్సైలు నాగరాజు, రమాదేవి, రమేశ్, 70 మంది కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.