
- ఖాళీగా సీఈ పోస్ట్, ఎస్ఈకి అడిషనల్ చార్జ్
- ప్రాజెక్టుల పర్యవేక్షణపై ప్రభావం
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ల కొరత నెలకొంది. సీఈ, ఎస్ఈ, ఈఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లేకపోవడం జిల్లాకు శాపంగా మారింది. దీంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలో 12లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ పర్యవేక్షణ, నిధుల వినియోగం గందరగోళంగా మారింది.
ఖాళీలు లేదంటే అదనపు బాధ్యతలు..
ఇన్చార్జి సీఈగా పని చేసిన సర్కిల్–1 ఎస్ఈమార్చిలో రిటైర్ అయ్యారు. సర్కిల్–2 ఎస్ఈ సత్యనారాయణ రెడ్డికి వనపర్తి ఇన్చార్జి సీఈగా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఆరు ఇరిగేషన్ డివిజన్లు ఉండగా, అచ్చంపేట డివిజన్ ఈఈ రిటైర్ అయ్యి ఏడాది దాటినా ఇంత వరకు ఎవరినీ నియమించలేదు. కొల్లాపూర్ డివిజన్ ఈఈగా పని చేస్తున్న శ్రీనివాస్రెడ్డికి పక్క జిల్లాలో ఇన్చార్జి ఎస్ఈగా బాధ్యతలు అప్పగించారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ డివిజన్లలో పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నడుస్తుండగా, కల్వకుర్తి డివిజన్లో పనులు మొదలు కాలేదు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ–29లో కాల్వలు,ఉప కాల్వలు, మైనర్లు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ ఇంజనీర్లకు అదనంగా కీలక బాధ్యతలు అప్పగించడంతో ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదల, వ్యయం, క్వాలిటీ, పర్యవేక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
ఇంజనీర్ల కొరత తీర్చితేనే..
ఇన్చార్జి ఇంజనీరింగ్ అధికారులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్తో పాటు కేఎల్ఐ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అంటున్నారు. జిల్లాలో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తామని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రెగ్యులర్ అధికారులు నియమించాలని చెబుతున్నారు. సీఈ, రెండు ఎస్ఈ, అచ్చంపేట డివిజన్ ఈఈ పోస్టును భర్తీ చేయాలని కోరుతున్నారు. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో కింది స్థాయి అధికారులు సైతం పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే విమర్శలున్నాయి.
పర్యవేక్షణే కీలకం..
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, ఆర్అండ్ఆర్, నిధుల వినియోగం, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాల పర్యవేక్షణకు చీఫ్ ఇంజనీర్, రెండు ఎస్ఈ సర్కిల్స్, ఆరు డివిజన్లు ఏర్పాటు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని 21 ప్యాకేజీల్లో కీలకమైన 12 ప్యాకేజీలు నాగర్కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. ఇందులో రిజర్వా యర్లు, పంప్ హౌజ్ లు, అండర్టన్నెల్స్, ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి. నార్లాపూర్ సమీపంలో అంజనాద్రి రిజర్వాయర్, పంప్హౌజ్, ఏదుల రిజర్వాయర్, పంప్హౌజ్, వట్టెం పంప్హౌజ్, రిజర్వా యర్ వంటి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు జరుగుతున్నాయి. రిజర్వాయర్లు, కెనాల్స్లో ముంపునకు గురైన గ్రామాల పునరావాసం వంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 2023లో నార్లాపూర్ పంప్హౌజ్లో ఒక్క పంపు బిగించేందుకే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చెమటోడ్చారు.
అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు నడుస్తూనే ఉన్నాయి. నార్లాపూర్, -ఏదుల రిజర్వాయర్ల మధ్య మెయిన్ కెనాల్ పెండింగ్ పనులు, పంప్హౌజ్లో మోటార్ల బిగింపు, ఎలక్ట్రో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ పనులు, ఒక టీఎంసీ నీటిని తరలించే అండర్ టన్నెల్ లైనింగ్, ఓపెన్ కెనాల్ పనులు మిగిలిపోయాయి. కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలో ఐదేండ్ల కింద ప్రమాదానికి గురైన ఎల్లూరు ఫస్ట్ లిఫ్ట్లో రెండు పంపులు ఇంకా వినియోగంలోకి తేలేదు. గుడిపల్లిగట్టులో ఒక పంపు సంగతి ఇంకా తేలలేదు. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేసిన లింక్ కెనాల్,హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, తదితర కీలక పనులు నిలిచిపోయాయి.
బడ్డెట్లో నిధులిచ్చినా..
ఈ సారి బడ్డెట్లో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. నిధుల వ్యయం, నిర్వహణ, పురోగతిపై సమీక్షలు ఎవరు నిర్వహిస్తారని అంటున్నారు. పెండింగ్ బిల్లుల పంచాయితీ, డీపీఆర్లోని పనుల్లో వేగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసి ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలని కోరుతున్నారు.