కాంగ్రెస్​ ఖాతాలో డీసీసీ బ్యాంకు

కాంగ్రెస్​ ఖాతాలో డీసీసీ బ్యాంకు
  •      గొంగిడి మహేందర్​ రెడ్డి పై నెగ్గిన అవిశ్వాసం
  •      జులై 1న డీసీసీబీ కొత్త చైర్మన్ ఎన్నిక
  •      ఇదివరకే చేజిక్కిన డీసీఎంఎస్​ ​ 

నల్గొండ, వెలుగు : నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్​ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది. 15 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆయన పదవి కోల్పోయారు. జిల్లాలో రెండు సహకార సంస్థలు డీసీసీబీ, డీసీఎంఎస్​లను కాంగ్రెస్​ వశం చేయడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి సక్సెస్​ అయ్యారు. 

ఈ రెండు సంస్థలకు కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులే చైర్మన్లు అవుతున్నారు. ఈ నెల 22న డీసీఎంఎస్​కు జరిగిన ఎన్నికల్లో మంత్రి అనుచరుడు కేతేపల్లి మండలానికి చెందిన బోళ్ల వెంకటరెడ్డి చైర్మన్​గా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్​గా రాజగోపాల్​రెడ్డి ముఖ్య అనుచరుడు కుంభం శ్రీనివాస్​ రెడ్డిని చైర్మన్​గా ఎన్నుకోనున్నారు. 

డీసీసీబీలో నాడు ఒకే ఒక్కడు...

డీసీసీబీలో 19 మంది డైరెక్టర్లకు గాను బీఆర్​ఎస్​ హయాంలో కాంగ్రెస్​ నుంచి కుంభం శ్రీనివాస్​ రెడ్డి ఒక్కరే ఎన్నికయ్యారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే పలువురు డైరెక్టర్లు కాంగ్రెస్​లో చేరినా అవిశ్వాసానికి సరిపడ సంఖ్య రాలేదు. దీంతో మరికొంత మంది బీఆర్ఎస్​డైరెక్టర్లను ఆకర్షించడానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​రెడ్డితో మాట్లాడి 15 మంది డైరెక్టర్ల మద్దతు సంపాదించారు. ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే చైర్మన్​వైపు ఉన్నారు. దీంతో ఈనెల 10న డీసీఓకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు.   

ఈ పరిణామాలరీత్యా   మహేందర్​ రెడ్డి చైర్మన్​ పదవికి రాజీనామా చేస్తారని భావించినా ఆయన మెట్టుదిగలేదు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 13 మంది డైరెక్టర్లను క్యాంపునకు తరలించారు. 17 రోజులు క్యాంపులో ఉన్న డైరెక్టర్లు శుక్రవారం హైదరాబాద్​వచ్చి అక్కడి నుంచి నేరుగా ఓటింగ్​కు తరలివచ్చారు. అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన వైస్​ చైర్మన్​ దయాకర్​రెడ్డి కూడా ఓటింగ్​కు హాజరయ్యారు. శుక్రవారం డీసీసీబీ ఆఫీసులో డీసీఓ కిరణ్​ సమక్షంలో జరిగిన సమావేశంలో చైర్మన్​కు వ్యతిరేకంగా 15 మంది డైరెక్టర్లు ఓటేయడంతో తీర్మానం నెగ్గినట్టు ప్రకటించారు. 

రెండు నెలల నుంచే స్కెచ్​...

డీసీసీబీ పీఠాన్ని దక్కించుకోవడానికి రాజగోపాల్​రెడ్డి వర్గం రెండు నెలల నుంచి ప్లాన్​ చేస్తోంది. డైరెక్టర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. తనపై అవిశ్వాసం పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తెలిసినా చైర్మన్​మహేందర్​ రెడ్డి లైట్​ తీసుకున్నారు. డైరెక్టర్లను క్యాంపునకు తరలిస్తున్నా పట్టించుకోలేదు. చైర్మన్​ సొంత గ్రామం వంగపల్లికి చెందిన డైరెక్టర్​ రాంచందర్​ క్యాంపులో చేరడంతో మిగిలిన వారు కూడా కాంగ్రెస్​ వైపు మళ్లారు. ఒక దశలో మహేందర్​రెడ్డిని వంగపల్లి సొసైటీ చైర్మన్ గానే అనర్హునిగా చేసి బ్యాంకు చైర్మన్​పదవి నుంచి తప్పించాలని భావించిన కాంగ్రెస్​ నేతలు రెండుసార్లు ఎన్నికల వల్ల ఖర్చు పెరుగుతుందని   భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

సోమవారం చైర్మన్​ ఎన్నిక 

అవిశ్వాసంపై ఓటింగ్​సందర్భంగా పోలీసులు భారీ ​ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకే కాంగ్రెస్​ పార్టీ నేతలు శంకర్​ నాయక్​, బుర్రి శ్రీనివాస్​రెడ్డి, గుమ్మల మోహన్​రెడ్డి , కార్యకర్తలు పెద్ద ఎత్తున డీసీసీబీకి చేరుకున్నారు. 11 గంటలకు డైరెక్టర్లు చేరుకున్నారు. 12 గంటలకు అవిశ్వాసంపై ఓటింగ్​ ముగిసింది. వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. 

కొత్త చైర్మన్​ ఎన్నిక సోమవారం ఉదయం 9 గంటలకు జరగనుంది. కుంభం శ్రీనివాస్​ రెడ్డిని కొత్త చైర్మన్​గా ఎన్నిక కానున్నారు. వైస్​ చైర్మన్​గా దయాకర్​ రెడ్డి కొనసాగుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సహకారసంస్థల పదవీకాలం ఉంది. దీంతో కొత్త పాలకవర్గం 8 నెలల పాటు కొనసాగనుంది. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తే ఇదే పాలకవర్గం ఎన్నికలు జరిగే వరకు కొనసాగుతుంది.