
- రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం
- డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- హాజరైన ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ప్రముఖులు
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు రిపబ్లిక్ డే రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేసి, గ్రహీతలను గౌరవించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, కళా రంగంలో పద్మభూషణ్కు ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణ, పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణిశర్మ, రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ విశిష్ట పౌర పురస్కారాలను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢ్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో సోమవారం నలుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 57 మందికి పద్మ శ్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఇందులో సినీ నటుడు అజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఇతర ప్రముఖులు ఉన్నారు.
వైద్య రంగంలో నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్
వైద్య రంగంలో చేసిన కృషికిగానూ తెలంగాణ నుంచి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ దక్కింది. 2002 లో పద్మ శ్రీ, 2016 లో పద్మ భూషణ్ తో ఆయనను కేంద్రం సత్కరించింది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ గా గుర్తింపు పొందింది. ఇందులో గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ గా నాగేశ్వర్ రెడ్డి విశేష సేవలు అందించారు. మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం, దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు నాగేశ్వర్ రెడ్డి దగ్గర చికిత్స తీసుకున్నారు.
తండ్రి ఎన్టీఆర్ డ్రెస్ కోడ్లో బాలకృష్ణ
పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో నందమూరి బాలకృష్ణ మెరిసిపోయారు. తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) లాగా తెలుగుదనం ఉట్టిపడేలా ధోతి, మెడలో కండువాతో అందర్నీ ఆకర్షించారు. ఆయన పేరు పిలవగానే.. లేచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు సాగారు. మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ ను బాలకృష్ణ అందుకున్నారు. కళా రంగంలో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రం ఏపీ నుంచి ఈ అవార్డును ప్రకటించింది.
దాదాపు 5 దశాబ్దాలుగా వెండితెరపై బాలయ్య ప్రేక్షకుల్ని మెప్పించారు. తన నటనతో చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా.. ఈ అవార్డు ఫంక్షన్ కు ఆయన అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, కూతురు బ్రహ్మణి హాజరయ్యారు. అలాగే, కళా రంగంలో తెలుగు సాంస్కృతిక అవాధాన కవి డాక్టర్ మాగుడుల నాగఫణి శర్మ, సాంప్రదాయ బుర్రకథ లో మరియాల అప్పారావు (మరణానంతరం) ఏపీ నుంచి పద్మ శ్రీ పురస్కారాలు అందుకున్నారు.