![నేషనల్ గేమ్స్లో నందినికి స్వర్ణం](https://static.v6velugu.com/uploads/2025/02/nandini-wins-gold-at-national-games_grxhMXoDcW.jpg)
- నిత్య, నిషికాకు కాంస్యాలు
- విమెన్స్ నెట్బాల్ టీమ్కు రజతం
హైదరాబాద్, వెలుగు : నేషనల్ గేమ్స్లో తెలంగాణ ఒకే రోజు స్వర్ణం సహా నాలుగు పతకాలు సాధించింది. అథ్లెట్ అగసార నందిని స్వర్ణంతో మెరవగా, మరో అథ్లెట్ గంధె నిత్య, జిమ్నాస్ట్ నిషికా అగర్వాల్ కాంస్య పతకాలు గెలిచారు. విమెన్స్ నెట్ బాల్ టీమ్ రజతం కైవసం చేసుకుంది. డెహ్రాడూన్లో మంగళవారం ముగిసిన విమెన్స్ హెప్టాథ్లాన్ లో నందిని అగ్రస్థానం సాధించింది. మొత్తం ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5601పాయింట్లతో టాప్ ప్లేస్తో పసిడి పతకం సొంతం చేసుకుంది.
హర్యానాకు చెందిన పూజ (4999 పాయింట్లు) రజతం గెలవగా.. తమిళనాడు అథ్లెట్ దీపిక (4939 పాయింట్లు) కాంస్యం నెగ్గింది. మరోవైపు విమెన్స్ 200 మీటర్ల ఈవెంట్లో నిత్య కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో నిత్య 23.76 సెకండ్లతో మూడో స్థానంతో ఈ పతకం గెలిచింది. ఏపీ అమ్మాయి యెర్రాజి జ్యోతి 23.35 సెకండ్లతో టాప్ ప్లేస్తో గోల్డ్ నెగ్గింది. ఈ గేమ్స్లో ఆమెకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.
కర్నాటక అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప (23.70 సె) సిల్వర్ ఖాతాలో వేసుకుంది. నెట్బాల్ ఫాస్ట్5 విమెన్స్ ఈవెంట్లో తెలంగాణ జట్టు సిల్వర్ గెలిచింది. ఫైనల్లో తెలంగాణ 20–23 తేడాతో హర్యానా చేతిలో ఓడిపోయింది. విమెన్స్ జిమ్నాస్టిక్స్ ఆల్రౌండ్ వ్యక్తిగత విభాగంలో నిషికా అగర్వాల్ 44:767 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది.