
పటాన్చెరు, వెలుగు : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లు దింపుతామని పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం అక్రమ నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పోచారం గ్రామంలో సర్వే నెంబరు 62 లో ఉన్న ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, షాడో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వాటిని వెంటనే నిలిపివేయకపోతే బుల్డోజర్లతో కూల్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఆయనతో పాటు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వీరేశం, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, విశాల్ సింగ్, నరేశ్చారి పాల్గొన్నారు.