
- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు : జిల్లాలో ఆయా పనుల కోసం భూసేకరణను స్పీడప్ చేయాలని భూసేకరణ కార్యాలయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో భీమ, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భీమా ప్రాజెక్టు కు సంబంధించి జిల్లాలోని మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాల్లో పెండింగ్ లో ఉన్న 45.34 ఎకరాలకు అవార్డు పాస్ అయినందున వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ఇంకా 16.16 ఎకరాల భూసేకరణ వివిధ దశల్లో పెండింగ్ లో ఉందన్నారు.
నారాయణ పేట–-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో550 ఎకరాల భూసేకరణను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కాగా, సమావేశ ప్రారంభంలో ఎస్డీసీ అధికారులు భూసేకరణకుసంబంధించిన పూర్తిస్థాయి వివరాలను ఇవ్వక పోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, ఆర్డీవో రామచందర్ నాయక్, మక్తల్ సర్కిల్ ఎస్ఈ శ్రీధర్, మహబూబ్ నగర్ సర్కిల్ ఎస్ఈ చక్రధరం, పీఆర్ఈఈ హీర్యా నాయక్, ఎస్డీసీ కార్యాలయ అధికారులు, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.