
నారాయణపేట, వెలుగు: ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం హెలిప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తో కలిసి పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సీఎం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.
మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, రెండు పోలీస్ స్టేషన్ల బిల్డింగ్లు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ బెంషాలం, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, అడిషనల్ ఎస్పీ రియాజ్ హూల్ హక్, ఆర్డీవో రాంచందర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంకిషన్ పాల్గొన్నారు.
ఎస్సెస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
నారాయణపేట: ఎస్సెస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగారంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
అనంతరం ఆల్ ఇన్ వన్ క్యశ్చన్ బ్యాంక్ లను, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇన్స్పిరేషన్ లెటర్ను పంపిణీ చేశారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ కలీం, డీఆర్డీవో మొగులప్ప, డీపీఆర్వో రశీద్, టీచర్లు స్వామి, సంగీత, నారాయణరెడ్డి, మధు, మహేశ్ పాల్గొన్నారు.
మద్దూరు: ప్రతి స్టూడెంట్ కష్టపడి చదివి టెన్త్లో మంచి మార్కులతో పాస్ కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మండలంలోని పెదిరి పహాడ్ జడ్పీ హైస్కూల్ ను ఆమె తనిఖీ చేశారు. విద్యా బోధన, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.