కొరియోగ్రాఫర్ జానీ ఎక్కడ..? వెతుకుతున్న నార్సింగి పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ ఎక్కడ..? వెతుకుతున్న నార్సింగి పోలీసులు

లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీకి నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. జానీ కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరులో జానీ ఉన్నట్టు సమాచారం. నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారు. త్వరలోనే జానీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి తన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2017లో ‘ఢీ’ షోలో జానీ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది.

ఓ షో  కోసం జానీతో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీపై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సూపర్ హిట్ సాంగ్స్గా యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించిన పలు సాంగ్స్కు జానీ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాడు. ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్ జానీకి ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చింది.. పుష్ప సినిమాలోని శ్రీవల్లీ సాంగ్, బీస్ట్ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ALSO READ : ప్రముఖ నటి కన్నుమూత..లెజెండరీ హీరోలతో స్క్రీన్ షేర్

రాంచరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు జానీ ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇంత ప్రతిష్టాత్మక సినిమాకు పనిచేస్తుండగా జానీపై ఇలాంటి ఆరోపణలు రావడంతో మూవీ లవర్స్ అవాక్కయ్యారు. జానీ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్ నడుస్తుంది. టాలీవుడ్ నుంచి కూడా జానీకి వ్యతిరేకంగా కొందరు బాహాటంగా బయటికొస్తున్నారు. ప్రముఖ నటి ఝాన్సీ ఇప్పటికే బాధితురాలికి తన మద్దతు ప్రకటించి, ఇండస్ట్రీపరంగా అన్ని విధాలుగా ఆమెకు అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.