
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ నిజాం కాలేజీకి నేషనల్ అసెస్ మెంట్అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఇచ్చింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కాలేజీకి ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.వి. రాజశేఖర్ తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ లోని కాలేజీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాలేజీకి చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే ఏ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించామని చెప్పారు.
క్వాలిటీ విద్యను అందించడంతోపాటు విద్యార్థులు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడా, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఏ గ్రేడ్ లభించడం తమకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిందని... ఇక ముందు కూడా టీం వర్క్ తో కాలేజీలోని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.