
బడిలో సౌకర్యాల కోసం డబ్బులు కావాలని గవర్నమెంట్కి లెటర్ రాశాడు. రిప్లయ్ రాలేదు. అలాగని నిరుత్సాహపడలేదు. ఎన్జీవోలు, డోనర్స్ సాయం కోరాడు. ఫండ్స్ చాలకపోవడతో సొంత డబ్బు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాడు. అంతేకాదు ఆ ఊళ్లోని మూఢనమ్మకాన్ని కూడా పోగొట్టాడు. అందుకుగానూ పోయిన ఏడాది ‘ఉత్తమ టీచర్’గా రాష్ట్ర అవార్డు అందుకున్నాడు. పాఠాలు చెప్పడంతో పాటు పిల్లల మనసు గెలుచుకున్న ఇతనుఈ ఏడాది‘ నేషనల్ టీచర్ అవార్డు’ కూడా సాధించాడు. పేరు టి.పి.ఉమేశ్. కర్నాటకలో లోయర్ ప్రైమరీ స్కూల్లో టీచర్.
ఉమేశ్కు 2004లో ప్రైమరీ టీచర్ ఉద్యోగం వచ్చింది. బళ్లారి జిల్లాలోని చిక్ బళ్లారిలో మొదటి పోస్టింగ్. ఆ తర్వాత చిత్రదుర్గ జిల్లాలోని అమృతపుర అనే గిరిజన గ్రామంలోని స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను అక్కడ చేరేసరికి ఆ స్కూల్లో 39 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. అంత తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడానికి కారణం ఏంటో స్కూల్ కండిషన్ చూడగానే అర్థమైంది ఉమేశ్కు. మూడు గదులున్న స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో టెంట్లు, చెట్ల కిందనే క్లాస్లు చెప్పాల్సి వచ్చేది. అంతేకాదు తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు లేవు. ‘ఫెసిలిటీస్ కల్పించండ’ని అధికారులకు లెటర్ రాశాడు ఉమేశ్. వాళ్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. చెట్ల కింద ఎండావానకు పిల్లలు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోయాడు. గవర్నమెంట్ సాయం కోసం ఎదురుచూడకుండా డోనర్స్, ఎన్జీవోలని సాయం కోరాడు.
చిన్న ప్రయోగశాల ఉంది
‘వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్’ అనే ఎన్జీవో, రోటరీ క్లబ్ బెంగళూరు సంస్థలు రూ.30 లక్షల ఖర్చుతో నాలుగు గదుల స్కూల్ బిల్డింగ్, టాయిలెట్స్ కట్టించాయి. కొందరు డోనర్స్ 30 చెక్క బెంచీలు, 60 రీడింగ్ టేబుల్స్ ఇప్పించారు. అంతేకాదు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కర్నాటకలోని ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్లో మినీ లాబోరేటరీ ల్యాబ్ ఉన్న స్కూల్ ఇదే. ఫండ్స్ చాలకపోవడంతో సొంత డబ్బు రూ. 20 వేలు ఖర్చు చేసి స్కూల్ బిల్డింగ్, కాంపౌండ్ వాల్కి పెయింటింగ్ వేయించాడు. ఒకప్పుడు పిల్లల్ని ఈ స్కూల్కి పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా వాళ్లని ఈ స్కూల్లోనే చేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 64 మంది పిల్లలు చదువుకుంటున్నారు.
మూఢనమ్మకాన్ని పోగొట్టాడు
కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్లు మొదలయ్యాయి. అయితే అప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ కొనిచ్చే స్థోమత లేదు ఆ పిల్లల తల్లిదండ్రులకు. దాంతో పిల్లలు పాఠాలు మిస్ కాకూడదని సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్లోనే ఉండి వాళ్లకు క్లాస్లు చెప్పాడు ఉమేశ్. బడికి రాని పిల్లలకు ఇంటి దగ్గర, ఊళ్లోని గుడిలో మరీ పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. అంతేకాదు ఊరి ప్రజల మూఢనమ్మకాన్ని కూడా పోగొట్టాడు. నెలసరి టైంలో ఆడవాళ్లని ఊరవతలకి పంపించే ఆచారం ఉండేది ఆ ఊళ్లో. గ్రామస్తులతో మాట్లాడి వాళ్లలో మార్పు తెచ్చాడు. రచయిత కూడా అయిన ఉమేశ్ ఆరు పుస్తకాలు రాశాడు.
కాన్ఫిడెన్స్ పెరిగింది
‘‘స్కూల్లో ఫెసిలిటీస్ లేవని కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదనిపించింది. అందుకనే డోనర్ల సాయంతో స్కూల్లో ఫెసిలిటీస్ కల్పించాలనుకున్నా. నా ప్రయత్నం ఫలిచింది. స్కూల్ బిల్డింగ్తో పాటు అన్ని సౌకర్యాలు ఉండడంతో పిల్లలు రెగ్యులర్గా బడికి వస్తున్నారు. వాళ్లలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కొంతమంది పిల్లలు ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు” అని చెప్పాడు ఉమేశ్.