హైవేకు భూములియ్యం..నేషనల్ హైవే ఆఫీసర్ల ఎదుట రైతుల నిరసన

హైవేకు భూములియ్యం..నేషనల్ హైవే ఆఫీసర్ల ఎదుట రైతుల నిరసన
  •     భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

కోల్ బెల్ట్, వెలుగు : నేషనల్​ హైవే–63 ఫోర్​లేన్​ నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తిమ్మాపూర్  గ్రామ శివారులో హైవే బైపాస్​ ప్రతిపాదిత స్థల పరిశీలనకు వచ్చిన హైవే ఆఫీసర్ల ఎదుట నిరసన తెలిపారు. ఫోర్​లేన్ లో భాగంగా వేంపల్లి నుంచి కుర్మపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర బైపాస్​ను నిర్మించి మంచిర్యాల–చాందాహైవేకు అనుసంధానం చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో నిర్వాసితుల డిమాండ్లు, సమస్యలు తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సోషల్​ ఇంపాక్ట్​ అసెస్​మెంట్​ ఎక్స్​పర్ట్  ఆనంద్ బాబు, నేషనల్​ హైవే సైట్​ ఇంజనీర్  బి.సంతోష్​ తదితరులు నిర్వాసితులతో చర్చించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో హైవేకు భూములు ఇవ్వమని కొందరు నిర్వాసితులు తేల్చిచెప్పారు.

భూములు గుంజుకోవద్దు..

ఏండ్ల కింద అప్పు చేసి కొనుక్కున్న భూములను హైవేకు ఇవ్వబోమని భూ యజమానులు తెలిపారు. 8 నెలలుగా నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు కొంత మంది బడా వ్యక్తుల భూములను కాపాడేందుకే మూడు సార్లు అలైన్​మెంట్​ మార్చారని మండిపడ్డారు. 

ప్రస్తుత భూమి ఓనర్లను పిలవకుండా, గతంలో అమ్మిన వ్యక్తులు, దళారులను పిలిచి భూముల్లో సర్వే చేసి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్​ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, నిజమైన నిర్వాసితులను గుర్తిస్తే సహకరిస్తామని మరి కొందరు పేర్కొన్నారు.