డేంజర్ గా హైవే .. డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు

డేంజర్ గా హైవే .. డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు
  • పట్టణాలు, గ్రామాల వద్దే ఫోర్​ లేన్​, డివైడర్​
  • మిగితా అంతా టూలేన్​ రోడ్డు 
  • తరచూ రోడ్డు ప్రమాదాలు 4 నెలల్లో 15 మంది మృతి

మెదక్/ కౌడిపల్లి, వెలుగు: నేషనల్ హైవే 675 డీ డేంజర్​ గా మారింది. పట్టణాలు, గ్రామాల దగ్గర తప్ప మిగితా అంతా టూ లేన్​ రోడ్డే ఉండటం, ఫారెస్ట్​ఏరియాలో మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు బాగుండడంతో వెహికల్స్ స్పీడ్ ఎక్కువగా ఉండడం, మధ్యలో డివైడర్​ లేక పోవడం వల్ల చాలాసార్లు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. 

విస్తరణకు ‘ఫారెస్ట్’​ అడ్డు 

హైద్రాబాద్​ బాలానగర్​ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ పట్టణానికి ఇదివరకు సింగిల్​ రోడ్డే ఉండేది. ఈ రూట్లో వాహనాల సంఖ్య పెరగడంతో స్టేట్​హైవేగా ఉన్న ఈ రోడ్డును 2017 –-18 లో నేషనల్​ హైవే గా మార్చారు. బాలానగర్, మెదక్​మధ్య హైవే కోసం రూ.320 కోట్లు మంజూరుకాగా.. నేషనల్​ హైవే అథారిటీ ఆధ్వర్యంలో 2021నాటికి నిర్మాణం పూర్తయింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, మెదక్​ జిల్లాలోని నర్సాపూర్ టౌన్, వెంకట్రావ్ పేట, కౌడిపల్లి, కొల్చారం, అప్పాజిపల్లి, పోతంశెట్టి పల్లి, మంబోజిపల్లి గ్రామాల వద్ద కొంత దూరం మాత్రమే 4 లేన్ రోడ్డుగా విస్తరించి, డివైడర్ ఏర్పాటు చేశారు. పారెస్ట్​ క్లియరెన్స్​ రాకపోవడంతో గుమ్మడిదల, నర్సాపూర్​మధ్య 14 కిలోమీటర్ల దూరం టూలేన్​ రోడ్డు మాత్రమే నిర్మించారు. ఇక్కడ మూలమలుపులు ఎక్కువగా ఉండడం, ఫారెస్ట్​ అనుమతుల్లేక వాటిని అలాగే వదిలేయడంవల్ల సమస్యలు వస్తున్నాయి. ​ 

మూలమలుపులతో ముప్పు

డివైడర్లు లేని చోట్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నర్సాపూర్​ మండలం చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట గేట్ల దగ్గర, కౌడిపల్లి మండలం తునికి గేట్, రాయిలాపూర్, నాగ్సాన్​పల్లి, అంతారం గేట్​, మహ్మద్​ నగర్​ గేట్​, కొల్చారం మండలంలోని లోతు వాగు దగ్గర, జైన్​ మందిర్ మూలమలుపువద్ద, కిష్టాపూర్ గేట్, రాంపూర్​ గ్రామాల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నర్సాపూర్, గుమ్మడిదల మధ్య మూల మలుపులు డేంజర్​ స్పాట్లుగా మారాయి. గత 4 నెలల్లోనే ఈ రూట్లో జరిగిన ప్రమాదాల్లో15 మంది చనిపోయారు. ఈ వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరగ్గా ఆరుగురు చనిపోయారు. 

ఈ నెల 20న కౌడిపల్లి మండలం రాయిలాపూర్, ​ - వెంకట్రావ్​ పేట మధ్య రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 26న నర్సాపూర్​ మండలం పెద్ద చింతకుంట వద్ద రెండు బైక్​ లు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏటా దాదాపు 50 మంది వరకు ప్రమాదాల్లో చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.  హైవేపై ప్రమాదాల నివారణకోసం పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎస్పీ ఉదయ్ కుమార్​రెడ్డి చొరవ తీసుకుని మూల మలుపులు ఉన్న చోట రబ్బర్​ బోల్డార్స్​ ఏర్పాటు చేయించారు. అక్కడ ప్రమాదాలు తగ్గినప్పటికీ డివైడర్​ లేని మిగతా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనేఉన్నాయి. మలుపులు సవరించి రోడ్డును మరింతగా విస్తరించడం, డివైడర్​ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు నివారించాలని స్థానికులు అంటున్నారు.