రష్యాకు అజిత్​ దోవల్.. ఉక్రెయిన్​ యుద్ధంపై చర్చించే చాన్స్​

రష్యాకు అజిత్​ దోవల్.. ఉక్రెయిన్​ యుద్ధంపై చర్చించే చాన్స్​

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్​ముందుకొచ్చింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ఈ వారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‎లో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సుకు హాజరవుతారు. అలాగే, ఉక్రెయిన్‎తో యుద్ధం ముగించేలా రష్యా అధికారులతో చర్చలు జరుపనున్నట్టు సమాచారం. అదేసమయంలో చైనా ప్రతినిధులతో కూడా మాట్లాడుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‎లో మోదీ పర్యటన తర్వాత రెండున్నర వారాలకే దోవల్​రష్యాకు వెళ్లడం విశేషం. 

శాంతిస్థాపనకు భారత్​ మధ్యవర్తి..!

రష్యా, ఉక్రెయిన్​మధ్య శాంతి స్థాపనకు భారత్​మధ్యవర్తిత్వం వహిస్తుందని ఇప్పటికే ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్​పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీతో ఆయన  చర్చించారు. రష్యా–-ఉక్రెయిన్‌‌ యుద్ధం విషయంలో భారత్‌‌ శాంతివైపు ఉంటుందని  స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌‌లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధంలో చైనా, భారత్‌‌, బ్రెజిల్‌‌ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల పుతిన్‌‌ కూడా పేర్కొన్నారు.