
ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో బీటెక్ అడ్మిషన్స్కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఇంటర్ ఎంపీసీలో చేరిన మొదటి రోజునుంచే కష్టపడుతుంటారు. 2024 జనవరి 24 నుంచి తొలి సెషన్ను, ఏప్రిల్ 1 నుంచి రెండో సెషన్ను నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం..
జేఈఈ- మెయిన్స్ దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్లో బీటెక్లో అడ్మిషన్స్కు నిర్వహించే పరీక్ష. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. ఎన్టీఏ ముందుగానే పరీక్ష తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
పోటీ ఎక్కువే : జేఈఈ -మెయిన్స్కు జాతీయ స్థాయిలో సంవత్సరానికి పది లక్షల మందికిపైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ రెండు సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్షకు హాజరయ్యారు. జనవరి సెషన్లో 8,23,967 మంది, ఏప్రిల్ సెషన్లో 8,83,367 మంది పరీక్ష రాసారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు.
ఎగ్జామ్స్ ఎప్పుడంటే : జేఈఈ- మెయిన్ 2024 తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. తొలి సెషన్ను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు, రెండో సెషన్ను ఏప్రిల్ 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలి సెషన్కు సుమారు మూడు నెలలు, రెండో సెషన్ దాదాపు ఏడు నెలల సమయం ఉంది. విద్యార్థులు సరైన టైమ్ ప్లాన్ రూపొందించుకొని జేఈఈ- మెయిన్కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.
ఆబ్జెక్టివ్ ఎగ్జామ్.. నెగెటివ్ మార్కులు : బీఈ, బీటెక్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి మొత్తం 300 మార్కులకు జేఈఈ మెయిన్(పేపర్1) పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్ ఎ, సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్- ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్ -బి లో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఛాయిస్ విధానం కారణంగా సెక్షన్- బిలో 10 ప్రశ్నల్లో అయిదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్- ఎలో 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
ఉమ్మడి అంశాలపై దృష్టి : ప్రస్తుతం సెకండ్ ఇయర్ విద్యార్థులు డిసెంబర్ రెండో వారం నాటికి ఇంటర్మీడియెట్ సిలబస్ను పూర్తి చేసుకుంటారు. జేఈఈ- మెయిన్ జనవరి సెషన్ పరీక్షలో రాణించేలా ఇప్పటి నుంచి ఉమ్మడి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇంటర్మీడియెట్, జేఈఈ- మెయిన్లో ఉన్న ఉమ్మడి టాపిక్స్ రివిజన్కు అధిక సమయం కేటాయించాలి. తద్వారా జేఈఈ- మెయిన్ జనవరి సెషన్లో మంచి ప్రతిభ కనబర్చడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ : ఇంటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు జేఈఈ-మెయిన్ పరీక్ష ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకోవాలి. ఆ దిశగా ఆయా సబ్జెక్ట్లను అప్లికేషన్ ఓరియెంటేషన్తో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్ల బేసిక్ కాన్సెప్ట్స్పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఇంటర్ సబ్జెక్ట్లపై పూర్తి స్థాయి పట్టుతోపాటు జేఈఈ- మెయిన్లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా చదివేటప్పుడే ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్ను షార్ట్ నోట్స్గా రూపొందించుకుంటే ఎగ్జామ్ టైమ్లో రివిజన్కు ఈజీగా ఉంటుంది.
సిలబస్ అనుసంధానం : జేఈఈ -మెయిన్ విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మొదటి సంవత్సరం అంశాలను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే.. సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభించడంతోపాటు ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వొచ్చు. జేఈఈ- మెయిన్ సిలబస్లో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. రెండు సంవత్సరాల సిలబస్పై పట్టు సాధించేలా కృషి చేయాలి.
న్యూమరికల్ ప్రశ్నలపై ఫోకస్ : అభ్యర్థులు ముఖ్యంగా న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ ప్రిపరేషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ- మెయిన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్ విద్యార్థులు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్కు, ఆయా సబ్జెక్ట్లలో న్యూమరిక్స్ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రాక్టీస్ ముఖ్యం : ఇంటర్, జేఈఈ- మెయిన్ రెండు పరీక్షలకూ ప్రాక్టీస్ ముఖ్యం. విద్యార్థులు మెయిన్ మాక్ టెస్ట్లకు, ఇంటర్ ప్రీ-ఫైనల్ టెస్ట్లకు హాజరైతే పరీక్షలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. జనవరి సెషన్కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని రివిజన్కు, వీక్లీ టెస్ట్లకు, మాక్ టెస్ట్లకు కేటాయించాలి.
ఏప్రిల్ సెషన్ ప్లాన్ : ఏప్రిల్ సెషన్పై ఫోకస్ చేసిన విద్యార్థులు ఇప్పటి నుంచే మంచి వ్యూహంతో ప్రిపరేషన్ సాగిస్తే మంచి మార్కులు పొందవచ్చు. డిసెంబర్లో ఇంటర్ సిలబస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జేఈఈ- మెయిన్ పరీక్ష సిలబస్కు అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ సెషన్ తేదీకి మధ్య సమయాన్ని పూర్తిగా రివిజన్, మాక్ టెస్ట్ల ప్రాక్టీస్కు కేటాయించాలి.
టైమ్ మేనేజ్మెంట్ : పోటీ పరీక్షల్లో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయం కేటాయించాలి. కనీసం రెండు గంటలు ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించాలి. సులభమైన సబ్జెక్ట్కు తక్కువ సమయం కేటాయించి, క్లిష్టంగా భావించే సబ్జెక్ట్లకు ఎక్కువ సమయం కేటాయించాలి. ముందు రోజు చదివిన అంశాన్ని ఒకసారి రివిజన్ చేసుకోవడం బెటర్.
సబ్జెక్ట్ వారీగా టాపిక్స్
మ్యాథ్స్ : సిలబస్కు సంబంధించి ప్రతి చాప్టర్ను తప్పనిసరిగా చదవాలి. 3-డీ జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. వీటితోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలను ఒక్కసారైనా పూర్తి చేసే విధంగా ప్రిపరేషన్ ఉండాలి.
ఫిజిక్స్ : ఈ విభాగంలో న్యూమరికల్ అప్లికేషన్ అప్రోచ్కు ప్రాధాన్యమివ్వాలి. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెఎం అండ్ వేవ్స్కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్,వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్పై అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
కెమిస్ట్రీ : ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్ల మూలాలపై నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటాయి. మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలి.
అడ్వాన్స్డ్ అర్హత : ఐఐటీల్లో అడ్మిషన్స్కు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు జేఈఈ-మెయిన్ నుంచి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. జేఈఈ -మెయిన్స్లో మంచి స్కోర్ సాధించేలా కృషి చేస్తే.. అడ్వాన్స్డ్కు అవకాశం లభిస్తుంది.