ఆధ్యాత్మికం: నవగ్రహాలను పూజిస్తే .. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..

ఆధ్యాత్మికం: నవగ్రహాలను పూజిస్తే .. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..

హిందూపురాణాల్లో  నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు త్రిమూర్తులు కూడా ఇబ్బందులు పడ్డారని పండితులు చెబుతుంటారు.  మానవుల భవిష్యత్తుకు సంబంధించి నవగ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.మన జాతక రీత్యా.. గోచారం ప్రకారం.. ఏఏ గ్రహాలు సంచరిస్తున్నాయి.. అవి ఏ స్థానంలో ఉన్నాయి.. ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి... వంటి విషయాలను జ్యోతిష్య పండితులు లెక్కలు వేసి చెబుతుంటారు.  మీకు ప్రతికూలంగా ఉండే గ్రహానికి జపం చేయాలి.. దానాలు చేయాలి.. ఆ గ్రహానికి సంబంధించిన నవరత్నాల్లోని ఉంగరాన్ని ధరించాలి చెబుతుంటారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు అధిపతులు ఎవరు.. వేటిని దానం చేయాలి..  నవరత్నాల్లోని .. ఏ రత్నం తో ఉంగరం చేయించుకోవాలో తెలుసుకుందాం.

ALSO READ | వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 05 వరకు

 అందకే దేవుళ్లతో పాటు సమానంగా నవగ్రహాలను పూజించాలి. వినాయక మండపం.. అమ్మవారి నవరాత్రిళ్లు ఏర్పాటు చేసే మండపం.. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు తప్పని సరిగా నవగ్రహాలను ఆరాధిస్తారు.  దీనినే మండప పూజ అంటారు. నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది. స్తావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే. త్రిమూర్తులు త్రిదేవినులు కొలువైనది ఈ గ్రహల్లోనే. గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు. అటువంటి గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు

  •  గురుపాలితములు: రవి, చంద్ర, కుజ, గురు, కేతు
  • శనిపాలితములు: శని, బుధ, శుక్ర, రాహు

పాపపుణ్యములు వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం, వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా నివారణ జరిగి కొంత ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. 

 

  • సూర్యుడికి అధిపతి అగ్ని.. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.
  • గురువుకు అధిపతి ఇంద్రుడు...గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు.
  • చంద్రుడికి అధిపతి వరుణుడు.. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది.
  • కుజుడికి అధిపతి కుమారస్వామి... కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ తొలగుతుంది.
  • బుధుడికి అధిపతి విష్ణువు... బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.
  • శుక్రుడికి అధిపతి శచీదేవి...శుక్రుని పూజలో అలచందల దానం చేయాలి. వజ్రం, పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. 
  • రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. 
  • కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక.. దైవశక్తి పెరుగుతుంది. 
  • శనికి అధిపతి బ్రహ్మ...శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి.

నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి. ..పూజించాలి అని చెపుతారు.