నవోదయ ఎక్కడ .. నలుగురు ప్రజాప్రతినిధుల మధ్య కిరికిరి

 నవోదయ ఎక్కడ .. నలుగురు ప్రజాప్రతినిధుల మధ్య కిరికిరి
  • ఎక్కడ ఏర్పాటు చేస్తారో కొలిక్కిరాని వైనం
  • జక్రాన్​పల్లిలో ఏర్పాటు చేయాలంటున్న ఎంపీ అర్వింద్​ 
  • కలెక్టర్ నుంచి సర్కారుకు ల్యాండ్ సర్వే నివేదిక
  • బోధన్​కు షిఫ్ట్​ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం​ 

నిజామాబాద్, వెలుగు : జిల్లాకు నవోదయ రెసిడెన్షియల్​ పాఠశాల మంజూరైంది. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై  ప్రజాప్రతినిధులు ఎవరికి వారే పైరవీలు చేస్తున్నారు.  జిల్లాకు చెందిన నలుగురు ముఖ్య నేతలు తాము చెప్పిన చోటే స్కూలు ఏర్పాటు చేయాలని పంతం పడుతున్నారు. ఎంపీ అర్వింద్​ జక్రాన్​పల్లి మండలంలో ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి  తన స్వగ్రామం అంకాపూర్​లో స్కూల్  నిర్మిస్తే బాగుంటుందని ఇప్పటికే ప్రతిపాదించారు. రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన సెగ్మెంట్లో నిర్మించాలని కోరుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్యెల్యే సుదర్శన్​రెడ్డి  నవోదయను  బోధనకు తరలించుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు.

కొత్తగా ఏడు నవోదయ స్కూళ్లు..

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్​నగర్​, సంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్​-మల్కాజ్​గిరి, జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాలకు కొత్త గా నవోదయ స్కూళ్లు గత ఏడాది మంజూరయ్యాయి. రాష్ట్ర సర్కార్​30 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన చోట కేంద్రం రెసిడెన్షియల్​ స్కూల్​ నిర్మాణాలు చేపడుతుంది. నిజామాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్​ పరిధిలోని జగిత్యాల జిల్లా నవోదయను కోరుట్లలో నిర్మించాలని నిర్ణయించారు. నిజామాబాద్​ జిల్లాలో మాత్రం ప్రజాప్రతినిధుల మధ్య లొల్లి నడుస్తున్నది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నారాయణపూర్​ శివారులో నిర్మించాలని కోరుతుండగా, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అంకాపూర్​ను తెరమీదకు తేగా ఎంపీ అర్వింద్​ జోక్యంతో కొంత కూల్ అయ్యారు.

ఆర్మూర్​ సెగ్మెంట్ పరిధిలోని జక్రాన్​పల్లి మండలం కలిగోట్ విలేజ్​లోని  సర్వే నంబర్​ 1063లో 30 ఎకరాల స్థలం ఉందని ఎంపీ అర్వింద్​ ప్రతిపాదించారు. బోధన్​, నిజామాబాద్​ సిటీలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నందున నవోదయను మరోచోట ఏర్పాటు చేయాలని అర్వింద్​ భావిస్తున్నారు.  క్రమంలో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు జనవరి 28న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి ఆఫీసర్ల టీం 15 రోజుల క్రితం వచ్చి కలిగోట్​లోని సర్వే నంబర్​ 1063 విజిట్ చేసి వెళ్లింది. ఇప్పుడు మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఆచన్​పల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ సర్వే నంబర్​ 690లోని ల్యాండ్​ను నవోదయ స్కూల్​ కోసం  ప్రతిపాదించారు.  

తాత్కాలిక స్కూల్​ కోసం మూడు ప్రతిపాదనలు

నవోదయ రెసిడెన్షియల్ స్కూల్​ బిల్డింగ్​ నిర్మాణానికి ల్యాండ్​ కిరికిరి ఇలా ఉండగా 2025–26 విద్యాసంవత్సరంలో స్కూల్ ప్రారంభించాలని నవోదయ విద్యా సమితి నిర్ణయించింది. పర్మినెంట్ బిల్డింగ్​ పూర్తయ్యే వరకు తాత్కాలిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం నగరంలోని డైట్ కాలేజీ, డిచ్​పల్లిలోని సీఎంసీ బిల్డింగ్,  కేశాపూర్​లో మూసివేసిన సుధీర్​రెడ్డి ఇంజినీరింగ్​ కాలేజీ బిల్డింగ్​లను  పరిశీలించారు.

ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్, వెలుగు :   నవోదయ స్కూల్​ను బోధన్​ తీసుకెళ్లడానికి  ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి  కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి బీజేపీ నేతలు సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్ది కూడా శకుని పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అర్వింద్​ కృషితో జిల్లాకు నవోదయ స్కూల్​ మంజూరైందన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​​, న్యాలం రాజు, పోతన్​కర్ లక్ష్మీనారాయణ. బద్దం కిషన్​, పద్మారెడ్డి, నాగరాజు, గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్​, ఆనందరావు పాల్గొన్నారు.

పదేండ్ల డిమాండ్​..

నవోదయ రెసిడెన్షియల్​ స్కూల్స్​లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందనే పేరుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధీనంలో అటానమస్​గా పనిచేసే నవోదయ విద్యా సమితి (ఎన్​వీఎస్​) దేశంలోని ప్రతి జిల్లాలో ఒక  రెసిడెన్షియల్ స్కూల్​ ఏర్పాటు చేసింది.  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని నిజాంసాగర్​ మండలంలో 1986లో నవోదయ స్కూల్​ ఏర్పడగా దానిని క్రమంగా ఆరో క్లాస్​ నుంచి ఇంటర్​ దాకా పెంచారు.  ప్రతి ఏడాది ఆరో క్లాస్​లో 80 సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఎనిమిది వేల మంది అటెండ్ అవుతున్నారు. జిల్లాల విభజన తరువాత కామారెడ్డి జిల్లా పరిధిలోకి నిజాంసాగర్ నవోదయ వెళ్లింది. నిజామాబాద్​ జిల్లాకు మరో నవోదయ కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు పదేండ్లుగా డిమాండ్​ చేస్తున్నారు.