హనుమకొండను కాపాడిన నయీం నగర్ నాలా

హనుమకొండను కాపాడిన నయీం నగర్ నాలా
  • ఓరుగల్లు ముంపునకు కబ్జాలేనని సర్టిఫికెట్ ఇచ్చి వదిలేసిన గత బీఆర్ఎస్ సర్కార్  
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నయీంనగర్ ​నాలాపై ఆక్రమణల తొలగింపు
  • నాలాపై రూ.90 కోట్లతో రిటైయినింగ్ వాల్, కొత్త ​బ్రిడ్జి నిర్మాణాలు
  • ఏండ్ల తరబడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు

వరంగల్‍, వెలుగు : చెరువులు, నాలాల ఆక్రమణలే వరంగల్​సిటీ మునకకు కారణమని గత బీఆర్ఎస్ సర్కార్ సర్టిఫికెట్​ఇచ్చింది.. తప్పితే ఎలాంటి ముంపు నివారణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రేటర్ వరంగల్ లోని నయీంనగర్​నాలాపై ఫోకస్ చేసింది. ఏటా దాదాపు 40–50 కాలనీలు నీట మునగడానికి కారణమయ్యే నాలాపై ఉన్న ఆక్రమణల కూల్చివేతకు కఠిన చర్యలు తీసుకుంది. 

అంతటితో ఆగకుండా రూ.90 కోట్లతో ఇరువైపులా రిటైయినింగ్ వాల్ ను నిర్మించింది. దీంతో ఈసారి వానాకాలంలో వరద ముప్పు నుంచి గ్రేటర్ వరంగల్ తప్పించుకుంది. కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నా కానీ.. హనుమకొండలో వరద ఎఫెక్ట్​పెద్దగా లేదు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో వరద కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం లభించింది.  

నాలుగేండ్లుగా మునిగిన సిటీ 

గ్రేటర్​సిటీలో మొత్తం 66  డివిజన్లు ఉండగా.. విలీన గ్రామాలతో కలిసి దాదాపు1,500 కాలనీలు ఉంటాయి. సిటీ సుమారు 24.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. కొన్నేండ్లుగా ట్రైసిటీలోని చెరువులు, నాలాలను కొందరు లీడర్లు, రియల్టర్లు, కబ్జాదారులు ఆక్రమించేశారు. 

100 ఫీట్ల వెడల్పు నాలాలు కాస్త చాలాచోట్ల 25 నుంచి 30 ఫీట్లకు కుంచించుకుపోయాయి. మరోవైపు నయీంన గర్, బొందివాగు, భద్రకాళి నాలాల్లోకి స్థానిక కాలనీల మురుగు నీరంతా చేరేది. దీంతో వరుసగా గత నాలుగేండ్లుగా వానాకాలమొచ్చిందంటే చిన్నపాటి వానలకే వరదలతో వందల కాలనీలు మునిగిపోయేవి.  

 వరంగల్​ తూర్పులోనే సీన్ రిపీట్​ 

వరంగల్ ట్రై సిటీలో గతంలో వరదలు వచ్చినప్పుడు 130 –150 కాలనీలు మునిగేవి. నాలుగు రోజుల కింద కురిసిన వానలకు మాత్రం దాదాపు 40 కాలనీలు మాత్రమే నీట మునిగాయి. ఇందులో దాదాపు 20 కాలనీలు వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. అయితే.. పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ లోని హనుమకొండలో నాలాల ఆక్రమణలను తొలగించినట్టుగా ఇక్కడ పూర్తిస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. 

దీంతో సాయిగణేశ్​కాలనీ, ఎస్ఆర్​నగర్, ఎన్​టీఆర్ నగర్, సంతోషిమాత టెంపుల్​ఏరియా, బీరన్నకుంట, ఉర్సు డీకేనగర్, సాయినగర్, బృందావన్​కాలనీ, హంటర్​రోడ్​ సీఎస్​ఆర్ గార్డెన్​జంక్షన్, ఎనుమాముల, బాలాజీ నగర్, మధురానగర్, లక్ష్మినగర్, గ్రీన్​సిటీ, కాశీకుంట, శివనగర్, గిరిప్రసాద్ నగర్, భద్రకాళి టెంపుల్ ఏరియాలోని భద్రకాళి జ్ఞాన సరస్వతీ కాలనీ, జెమిని టాకీస్ దగ్గరలోని పోతననగర్​కాలనీలు ముంపు బారిన పడ్డాయి.

 పదేండ్లలో పనులు చేయకపోగా    

ఏటా వానలు పడినప్పుడు వరంగల్​పశ్చిమ సెగ్మెంట్ హనుమకొండలోని 40– 45 కాలనీలను ముంచేసే నయీంనగర్ నాలా పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫోకస్ పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి రాజకీయ జోక్యం లేకుండా నాలాపై అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులకు పూర్తి అధికారం ఇచ్చింది. దీంతో కేసీఆర్ ​సర్కార్10 ఏండ్లలో చేయలేని పనులను బల్దియా ఆఫీసర్లు నెలన్నరలో చేసి చూపించారు. నాలాకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు.  కుంచించుకుపోయిన నాలాను విస్తరించారు. రూ.90 కోట్లతో రిటైయినింగ్ వాల్ నిర్మించారు.