న్యూఢిల్లీ: రాజకీయ స్థిరత్వం ఉండడంతో పాటు సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతానికి పైగా గ్రోత్ నమోదు చేస్తుందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) అంచనా వేసింది. వీలుంటే 7.5 శాతం వరకు గ్రోత్ రేట్ నమోదు కావొచ్చని తెలిపింది. 2023–24 లో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి చెందిందని జులై ఎకనామిక్ మంత్లీ రివ్యూ (ఎంఈఆర్) లో ఈ సంస్థ పేర్కొంది.
వినియోగం పెరగడంతో పాటు, భారీగా పెట్టుబడులు రావడంతో జీడీపీ మంచి గ్రోత్ నమోదు చేసిందని వెల్లడించింది. ఎకనామిక్ ఇండికేటర్లు పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయని, కిందటి ఆర్థిక సంవత్సరంలో కనిపించిన ట్రెండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఉంటుందని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనం గుప్తా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి 2024–25 బడ్జెట్ ఉందని కొనియాడారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతంగా మెయింటైన్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.