న్యూఢిల్లీ : కాఫీ హౌస్లను నిర్వహిస్తున్న కాఫీ డే గ్రూప్కు చెందిన పేరెంట్ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్)పై కార్పొరేట్ వివాద ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐడీబీఐటిఎస్ఎల్)కు రూ. 228.45 కోట్లు చెల్లించడంలో విఫలమవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంగళూరు బెంచ్ ఆగస్టు 8న ఈ ఆదేశాలు జారీ చేసింది. అప్పుల నిర్వహణను చూసుకోవడానికి ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ని నియమించింది.
సీడీఈఎల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీల) చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయింది. ఫైనాన్షియల్క్రెడిటర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా 1,000 ఎన్సీడీ సబ్స్క్రయిబ్ చేసింది. అయితే, సీడీఈఎల్ సెప్టెంబర్ 2019 – జూన్ 2020 మధ్య వివిధ తేదీలలో చెల్లించాల్సిన మొత్తం కూపన్ పేమెంట్లను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది. దీంతో డిబెంచర్ ట్రస్టీ, డిబెంచర్ హోల్డర్లందరి తరపున, జూలై 28, 2020న సీడీఈఎల్కి డిఫాల్ట్ నోటీసు జారీ చేసి ఎన్సీఎల్టీని సంప్రదించింది.