
ముంబై: డిప్యూటీ సీఎం, తన మేనల్లుడు అజిత్ పవార్ను ఓడించేందుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ భారీ స్కెచ్ వేశారు. ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ను ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు ఫ్యామిలీ మెంబర్ను బరిలోకి దించాడు. అజిత్ పవార్ పోటీ చేయనున్న బారామతి అసెంబ్లీ స్థానం నుండి యువ నాయకుడు యుగేంద్ర పవార్ను పోటీకి దించారు. ఈ మేరకు ఎన్సీపీ (శరద్ వర్గం) ఇవాళ అధికారిక ప్రకటన చేసింది. కాగా, యుగేంద్ర పవార్ శరద్ పవార్కు మనువడు. అజిత్ పవార్కు మేనల్లుడు. అయితే, తనను వెన్నుపోటు పొడిచి ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్పై ప్రతీకారం తీర్చుకోవాలని.. అందుకే అతడిపై సొంత కుటుంబ సభ్యుడినే శరద్ పవార్ బరిలోకి దింపినట్లు మహా పాలిటిక్స్లో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం గురువారం (అక్టోబర్ 24) 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్లో ఎన్సీపీ కీలక నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. సీనియర్ నేతులు అనిల్ దేశ్ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి, జయంత్ పాటిల్ ఇస్లాంపూర్, ముక్తైనగర్ నుంచి రోహిణి ఖడ్సే, జితేంద్ర అవద్- కాల్వా ముంబ్రా నుండి బరిలోకి దిగనున్నారు. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోంది.
ALSO READ | మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: మాజీ సీఎం శరద్ పవార్కు బిగ్ షాక్
కాగా, మాజీ సీఎం శరద్ పవార్ మేనల్లుడు అజిత్ ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చిన విషయం తెలిసిందే. తన వర్గం ఎమ్మెల్యేలతో అధికార మహాయతి కూటమితో అజిత్ పవార్ చేతులు కలపడంతో.. అతడిని డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఈ క్రమంలోనే పార్టీని విచ్ఛిన్నం చేసిన అజిత్ను ఓడించేందుకు శరద్ పవార్ వర్గం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పవార్ ఫ్యామిలీ మెంబర్స్ పోటీతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బారామతి ఎన్నిక హాట్ టాపిక్గా మారనుంది. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 23వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.