
సోనెపట్ : వచ్చే ఏడాది టోక్యోలో జరిగే వరల్డ్ చాంపియన్షిప్లో పతకం గెలవడమే తన తదుపరి లక్ష్యమని డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. ఇందుకోసం వంద శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగుతానని చెప్పాడు. ‘ఈ సీజన్ ముగిసింది. నా నెక్స్ట్ టార్గెట్ వరల్డ్ చాంపియన్షిప్. దాని కోసం ప్రిపరేషన్స్ను మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫుల్ ఫిట్నెస్ సాధించాలి ప్రస్తుతం గజ్జ, చేతి గాయం నుంచి కోలుకున్నా. ఒలింపిక్స్ గురించి మదిలో ఆలోచన ఉన్నా ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది’ అని నీరజ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం తన ఫిట్నెస్తో పాటు టెక్నిక్ను మెరుగుపర్చుకుంటున్నానని వెల్లడించాడు. ప్రఖ్యాత జర్మన్ బయో మెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్గోనిట్జ్ వద్ద ట్రెయినింగ్ తీసుకున్నట్లు తెలిపాడు. ‘ఈ ఏడాది మొత్తం గాయాలతోనే ఇబ్బందిపడ్డా. ఇప్పుడు వాటిని అధిగమించా. కొత్త సీజన్లో వంద శాతం ఫిట్గా ఉంటా. కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. వాటిపై పని చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలోనే ట్రెయినింగ్ చేస్తా. పోటీలు ఉన్నప్పుడు విదేశాల్లో ట్రెయినింగ్కు ఇష్టపడతా’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.