![రేపు (జులై4) పిల్లలకు హాలిడే.. దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్](https://static.v6velugu.com/uploads/2024/07/neet-exam-row-sfi-aisf-call-for-nationwide-education-strike-tomorrow_6JQ3D0F1Tp.jpg)
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జులై 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ ను ప్రకటించాయి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, ఎన్ఎస్ యూఐ. ఇటీవల జరిగిన నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జులై 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు.. అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. గత పదేండ్లలో 70 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని..దీనివల్ల దేశ ప్రతిష్ట మసకబారుతున్నదని ఆరోపించారు.
మోదీ పాలనలో పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీలు సర్వసాధారణం అయ్యాయి. పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం అయ్యింది. ఈ విషయాలపై దేశ ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజీపై నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిబట్టి చూస్తే పేపర్ లీకేజీలకు బీజేపీ నేతలే కారణమని అనుమానాలు వస్తున్నాయని బల్మూరి వెంకట్ అన్నారు.