టన్నెల్​లో రోబో సేవలకు బ్రేక్

టన్నెల్​లో రోబో సేవలకు బ్రేక్
  • వేధిస్తున్న నెట్​వర్క్​ ప్రాబ్లం

నాగర్​కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​ ఆదివారం 23వ రోజుకు చేరింది. టన్నెల్​లో  మనుషులు వెళ్లలేని డి1తో పాటు​చివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలంలో నెట్​ వర్క్​ ప్రాబ్లం ఎదురవుతోంది. టన్నెల్​లో బీఎస్ఎన్ఎల్​ 3జి నెట్​వర్క్​ అందుబాటులో ఉండగా, అన్వి సంస్థ రోబో పని చేయడానికి 5జి నెట్​వర్క్​ స్పీడ్​ అవసరం అవుతోంది. 

మాస్టర్​ రోబో నుంచి టన్నెల్​ లోపల పని చేసే అటానమస్​ హైడ్రాలిక్​ పవర్​ రోబోకు 5జి నెట్​వర్క్​ సెటప్​తో  కమాండ్స్​ సెట్​ చేశారు. టన్నెల్ లో బీఎస్ఎన్ఎల్​ 3జి నెట్​వర్క్​ మాత్రమే పని చేయడంతో సమస్య వచ్చినట్లు సమాచారం. 3జి నెట్​వర్క్​ సెటప్​తో రోబోలు పని చేసేలా ప్రయత్నిస్తున్నారు.

కొనసాగుతున్న రెస్క్యూ ..

టీబీఎం బేస్, ఇతర విడిభాగాలను గ్యాస్​ కటర్లతో తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్​ హోల్​ మైనర్లు డ్రిల్లింగ్​ చేసి మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్​ బెల్ట్​ అందుబాటులోకి వస్తే దానిపై వేసేలా రాళ్లను పగలగొడుతున్నారు. లోకో ట్రాలీల వరకు కట్​ చేసిన విడిభాగాలు, మట్టిని, రాళ్లను మోస్తున్నారు.13.500 కిలోమీటర్ల తర్వాత సీపేజీ​సమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 5 పంపులు కంటిన్యూగా పని చేస్తున్నా నీటి ఉధృతి తగ్గడం లేదు. 

ఆదివారం ఉదయం టన్నెల్​ లోపలికి వెళ్లిన కేరళ పోలీస్​కు చెందిన క్యాడవర్​ డాగ్​ స్క్వాడ్​ను మట్టి తవ్విన ప్రాంతంలో 4 మీటర్ల కింద ఉన్న టీబీఎం బేస్​ పరిసరాల్లో తిప్పారు. కలెక్టర్​ బదావత్​ సంతోష్​ ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్​ మైనర్లు, అన్వి రోబో సర్వీసెస్​ ఇన్​చార్జీలతో రెండు సార్లు రివ్యూ నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్​లో కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి జీఎం బైద్య టన్నెల్​లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్​కు వివరించారు. రెస్క్యూ బృందాలు ఉండేందుకు దోమలపెంటలో ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను కలెక్టర్​ పరిశీలించారు. వారికి కావాల్సిన అన్ని సౌలతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.