![కోర్టు కేసు వల్లే ఉస్మానియా కొత్త బిల్డింగ్ ఆగిపోయింది](https://static.v6velugu.com/uploads/2021/12/New-building-for-Osmania-Hospital_hHAQg8O7f9.jpg)
- కోర్టు కేసు క్లియర్ కాగానే నిర్ణయం: హరీశ్
- ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి
- మరో 4 అందుబాటులోకి తెస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కోర్టు కేసు వల్లనే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ ప్రాసెస్ నిలిచిపోయిందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు చెప్పారు. కేసు క్లియర్ అయిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మంగళవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్ మెషీన్ ను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రి సహా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో మరో నాలుగు క్యాథ్ ల్యాబ్లు అందుబాటులో కి తెస్తామని హరీశ్ రావు వెల్లడించారు. కొత్త దానితో కలిపి ఉస్మానిలో సిటీ స్కాన్మిషీన్ల సంఖ్య మూడుకు పెరిగిందని, ఇక నుంచి పేషెంట్లకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. టెస్టు రిపోర్టులు త్వరగా అందితే, తొందరగా ట్రీట్ మెంట్ చేసేందుకు వీలుంటుందని.. అన్ని ఆస్పత్రుల్లో 24 గంటల్లోపు రిపోర్టులు అందేలా చూస్తామని తెలిపారు. అన్ని హాస్పిటళ్లలో డైట్ చార్జీలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రికి ఎన్ఏబీసీ గుర్తింపు కోసం అవసరమైన సౌలతులు కల్పిస్తామన్నారు.
50 ఐసీయూ బెడ్స్.. 5 కోట్లతో కొత్త మార్చురీ
త్వరలో ఆస్పత్రిలో మరో 50 ఐసీయూ బెడ్స్, కొత్త వెంటిలేటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్ రావు చెప్పారు. అన్ని బెడ్స్ కూ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రూ.5 కోట్లతో కొత్త మార్చురీ కడ్తామని, రానున్న రోజుల్లో 24 గంటలూ పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రిలో శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కొత్త ఏజెన్సీ కోసం త్వరలోనే టెండర్లు వేస్తామని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలని సూచించారు. మళ్లీ జనవరి1న ఉస్మానియాకు వస్తానని చెప్పారు.
ఆస్పత్రిలో ఫస్ట్ స్కిన్ సర్జరీ...
ఉస్మానియాలో తొలిసారిగా స్కిన్ సర్జరీ చేశారు. జూన్ 28న ప్రారంభించిన స్కిన్ బ్యాంకులో ఫస్ట్ స్కిన్ సర్జరీ నిర్వహించామని ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్ నాగప్రసాద్ చెప్పారు. దేశంలో ప్రభుత్వ రంగంలో మూడు స్కిన్ బ్యాంకులే ఉండగా, అందులోఉస్మానియా ఒకటని తెలిపారు. జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి సహా మరొకరి నుంచి స్కిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. 45 రోజుల ప్రాసెస్ తర్వాత అన్ని టెస్టులు పూర్తి చేసి, 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న 21 ఏళ్ల నవీన్ అనే వ్యక్తికి మంగళవారం స్కిన్ సర్జరీ చేశామని.. అది సక్సెస్ అయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లను హరీశ్ రావు అభినందించారు.
టీఆర్ఎస్ కు తిరుగులేదు..
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ పై హరీశ్ రావు స్పందించారు. ఎన్నికల్లో టీఆర్ ఎస్ బ్రహ్మాండమైన విజయం సాధించిందన్నారు. మరోసారి తిరుగులేని పార్టీగా నిలిచిందన్నారు.
ఉస్మానియాలో డయాలసిస్ సెంటర్
ఉస్మానియాలో బెడ్ల కొరత నేపథ్యంలో అక్కడి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లను కింగ్ కోఠి హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలని మంత్రి సూచించారు. ఎయిడ్స్, హెపటైటీస్ రోగుల కోసం ఉస్మానియాలోనే డయాలసిస్ యూనిట్ను అందుబాటులోకి తేవాలన్నారు. గాంధీ ఆస్పత్రిలో తక్షణమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ప్రారంభించాలని, ఇందుకోసం ఉస్మానియాలో ఉన్న గ్యాస్ర్టో ఎంటరాలజిస్టులను గాంధీకి పంపించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను ఆదేశించారు. ఉస్మానియాలో మార్చురీని ఆధునీకరించడానికి నిధులు కేటాయించాలని ఆఫీసర్లు కోరగా, మంత్రి అంగీకరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెల్త్ ఆఫీసర్లను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం బీఆర్కే భవన్లో స్టేట్ హెల్త్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ చేశారు. విదేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.