
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్కు కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని, పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు నిమ్స్ హాస్పిటల్ విస్తరణను పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు ఇస్తామని పేర్కొంది. ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తామని, మొత్తంగా బడ్జెట్లో ఆరోగ్యశాఖకు రూ.11500 కోట్లు కేటాయించామని తెలిపింది. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ, ఇతర పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని తెలిపింది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకాన్ని పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మరింత విస్తృతపరిచి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా అవసరమైన నిధులను అలాట్చేస్తామంది. ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకాలను వీలైనంత తక్కువ టైమ్లో పూర్తి చేస్తామని పేర్కొంది. ప్రభుత్వ దవాఖాన్లను మరింత పటిష్టపరచి, వాటి నిర్వహణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపింది. కొత్త మెడికల్ కాలేజీలకు అవసరమైన సిబ్బందిని, వనరులను సమకూరుస్తామని తెలిపింది. అయితే, గతేడాది కంటే ఆరోగ్యశాఖకు ఈ సారి రూ.661 కోట్లు తక్కువగా అలాట్చేశారు. గత బడ్జెట్ ఆరోగ్యానికి రూ.12,161 కోట్లు కేటాయించారు.