శిథిలమైన స్లాబ్​ కిందే చదువులు .. కష్టతరంగా తరగతుల నిర్వహణ

 శిథిలమైన స్లాబ్​ కిందే చదువులు .. కష్టతరంగా తరగతుల నిర్వహణ

కామారెడ్డి, వెలుగు : శిథిలావస్థలో ఉన్న స్కూల్​ బిల్డింగ్​ను సగం కూల్చి వేసి మూడు ఏండ్ల క్రితం మన ఊరు–మన బడి కింద కొత్తగా క్లాస్​  రూమ్​ల నిర్మాణం చేపట్టారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్​ మధ్యలోనే పనులను నిలిపివేశారు.   అటు కొత్త బిల్డింగ్​ పనులు పూర్తి కాకపోవడం.. ఇటు శిథిలమైన నాలుగు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.   సరిపడా తరగతి గదులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గర్ల్స్​  హైస్కూల్ బిల్డింగ్​ దశాబ్దాల క్రితం నిర్మించింది. గత ప్రభుత్వం 2022లో చేపట్టిన మన  ఊరు–మన బడి కార్యక్రమంలో  రూ. 50 లక్షలతో  కొత్తగా క్లాస్​ రూమ్​ ల నిర్మాణం పనులు షూరు చేశారు. పాత బిల్డింగ్​ సగం కూల్చి వేసి రెండున్నర ఏండ్ల క్రితం నూతన గదుల నిర్మాణం చేపట్టారు.   

స్లాబ్​లు వేసి వదిలేశారు.  పనులకు సంబంధించి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్​ మిగతా పనులు ఆపేశాడు.  ప్రస్తుతం పాత బిల్డింగ్​లో 4 గదులు ఉన్నాయి. ఇవి కూడా పైకప్పు పెచ్చులూడటం, పగుళ్లు వచ్చాయి. 6  నుంచి 10 వ తరగతి వరకు   మొత్తం 103 మంది స్టూడెంట్స్​ ఉన్నారు.  4 గదుల్లోనే  5 క్లాస్​లు, ఆఫీసు రూమ్​, హెచ్​ఎం రూమ్​, స్టాఫ్​ రూమ్​  కొనసాగుతున్నాయి.  కింద మట్టి, చుట్టూ గోడలు లేక పోవటంతో  బాలికలు అవస్థలు పడుతున్నారు.  ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యార్థినులు  కోరుతున్నారు.