
- పోలీస్ జాగిలాలు వచ్చేస్తున్నయ్.
- ఎక్స్ప్లోజివ్స్, డ్రగ్స్ను గుర్తించడంలో 120 జాగిలాలకు శిక్షణ
- 8 నెలల ట్రైనింగ్ పూర్తి, నేడు పాసింగ్ అవుట్ పరేడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోకి 30 కొత్త జాగిలాలతో కూడిన కొత్త డాగ్స్క్వాడ్ జాయిన్ కాబోతోంది. వీటితోపాటు పేలుడు పదార్థాలు, డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు 120 జాగిలాలకు 8 నెలలు స్పెషల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ చేయనున్నాయి.
ఈ కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్ హాజరవుతున్నారు. అకాడమీలో లెబ్రడాల్, డాబర్మెన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షపర్డ్ జాతులకు చెందిన జాగిలాలకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 256 జాగిలాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలందిస్తున్నాయి.
వీటిలో సుమారు120 జాగిలాలు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ తీసుకున్నాయి. గంజాయి, డ్రగ్స్ వాడిన తర్వాత చేతికి ఉండే వాసనను గుర్తించి పట్టుకుంటాయి. వీటిని రైళ్లు, బస్ స్టేషన్స్తో పాటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే బోర్డర్ చెక్పోస్టుల వద్ద సెర్చ్ ఆపరేషన్స్లో వినియోగించనున్నారు.
హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లా కేంద్రాల్లోని విద్యా సంస్థల పరిసర ప్రాంతాలు, గ్రౌండ్స్, ఖాళీ ప్రదేశాల్లో ఈ ట్రాకర్లతో తనిఖీలు చేపట్టనున్నారు.