నూతన విద్యా విధానంతో అంగన్​వాడీలకు ముప్పు.. ఆదిలాబాద్ కలెక్టరేట్​ ఎదుట 48 గంటల ధర్నా

నూతన విద్యా విధానంతో అంగన్​వాడీలకు ముప్పు.. ఆదిలాబాద్ కలెక్టరేట్​ ఎదుట 48 గంటల ధర్నా

మంచిర్యాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం 2020తో అంగన్​వాడీ సెంటర్లు రద్దయ్యే ప్రమాదముందని సీఐటీయూ అనుబంధ అంగన్​వాడీ టీచర్స్​ అండ్ హెల్పర్స్​ యూనియన్​ నాయకులు అన్నారు. నూతన విద్యా విధానాన్ని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడు నుంచి ఆరేండ్ల పిల్లలను విద్యాశాఖలో విలీనం చేసి అంగన్​వాడీల వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్​ఈపీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పీఎం శ్రీ, మొబైల్​ అంగన్​వాడీ సెంటర్లను రద్దు చేయాలని, వేతన బకాయిలను, రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​ను వెంటనే చెల్లించాలని, అంగన్​వాడీ సెంటర్లకూ సమ్మర్​ హాలీడేస్​ ప్రకటించాలని డిమాండ్ ​ చేశారు. ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం కలెక్టరేట్​ ఎదుట వంటావార్పు చేశారు. 

పీఎంశ్రీ, మొబైల్​ అంగన్‌వాడీలను రద్దు చేయాలి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ఐసీడీఎస్​ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం, మొబైల్​ అంగన్వాడీ సెంటర్లను, ఎన్​ఈపీని ప్రభుత్వం రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సునీత​ డిమాండ్​ చేశారు. తెలంగాణ అంగన్​వాడీ టీచర్స్, హెల్పర్స్​ యూనియన్​ సీఐటీయూ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు ఈ నెల17, 18 తేదీల్లో  కలెక్టరేట్​ ముందు 48 గంటల ధర్నా, వంటావార్పులో భాగంగా సోమవారం అంగన్వాడీలు కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు.  వారి ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు.  నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.  ఐసీడీఎస్​ వ్యతిరేక విధానాల అమలును రాష్ట్రంలో వెంటనే ఆపాలని, ఎన్ఈపీ ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ , జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి,  తదితరులు పాల్గొన్నారు.