
న్యూఢిల్లీ: మనదేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 10వేల కోట్ల కార్పస్తో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (ఎఫ్ఎఫ్ఎస్)ను ప్రకటించింది. కేంద్రం 2016లో కూడా రూ. 10వేల కోట్ల కార్పస్తో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది.14వ,15వ ఆర్థిక కమిషన్లు ఈ మొత్తాన్ని మరింత పెంచాయి. వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను పెంచడానికి ఎఫ్ఎఫ్ఎస్ను ఏర్పాటు చేశారు.
దీనిని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) నిర్వహిస్తుంది. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) -రిజిస్టర్డ్ ఏఐఎఫ్లకు మూలధనాన్ని అందిస్తుంది. ఇవి స్టార్టప్లలో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్ల కోసం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) రూ. 91వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వీటికి రూ. 10వేల కోట్ల కార్పస్తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ మద్దతు ఇస్తున్నాయని ఆమె చెప్పారు.
ఈ పథకం కింద మరిన్ని నిధులను అందించాలని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)తో జరిగిన సమావేశంలో ఏఐఎఫ్లు డిమాండ్ చేశాయి. స్టార్టప్లలో పెట్టుబడిపెట్టే ప్రముఖ ఏఐఎఫ్లు చిరాటే వెంచర్స్, ఇండియా కోషియంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవీక్యాప్, వాటర్బ్రిడ్జ్, ఓమ్నివోర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్ ఫైర్సైడ్ వెంచర్స్కు ఎఫ్ఎఫ్ఎస్ కింద సాయం అందింది. ఏఐఎఫ్లు ఎఫ్ఎఫ్ఎస్ కింద కట్టుబడి ఉన్న మొత్తానికి కనీసం రెండు రెట్లు స్టార్టప్లలో పెట్టుబడి పెట్టాలి.
ఇప్పటికే రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులు
గత అక్టోబర్ నాటికి, ఎఫ్ఎఫ్ఎస్ -మద్దతు ఉన్న ఏఐఎఫ్లు స్టార్టప్లలో మొత్తం రూ. 20,572.14 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దేశంలో ఇన్నోవేషన్లను పెంపొందించడం, స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం బలమైన ఎకోసిస్టమ్ను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 31, 2024 నాటికి 55 కంటే ఎక్కువ పరిశ్రమలకు చెందిన మొత్తం 1,52,139 సంస్థలను స్టార్టప్లుగా గుర్తించారు.
ఈ యూనిట్లు స్టార్టప్ ఇండియా యాక్షన్ప్లాన్ కింద పన్ను, పన్నుయేతర ప్రోత్సాహకాలను దక్కించుకుంటాయి. వీటిలో 46వేలకుపైగా సంస్థలు వివిధ టెక్నాలజీ, అనుబంధ పరిశ్రమలలో స్టార్టప్లుగా గుర్తింపుపొందాయి. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, రోబోటిక్స్, టెక్నాలజీ హార్డ్వేర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీ వంటివి ఉన్నాయి. స్టార్టప్ ఇండియా చొరవ కింద ప్రభుత్వం, దాని ప్రధాన పథకాలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ స్టార్టప్స్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించింది. డీపీఐఐటీ పర్యవేక్షణ సంస్థ కాగా, సిడ్బీ ఎఫ్ఎఫ్ఎస్కు ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది.