
- ‘క్యుటాలి’ కి రూపకల్పన చేసిన యూఎస్ ఆర్మీ రిసర్చ్ ల్యాబ్
- పేటెంట్ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం
- విమానయానం, రక్షణ రంగం, ఇండస్ట్రీల అవసరాలకు వాడకం
హైదరాబాద్, వెలుగు: కొన్ని వందల డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకునే సరికొత్త లోహాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. కాపర్, టాంటలం, లిథియం అణువులతో తయారు చేసిన ఆ లోహాన్ని క్యుటాలిగా సైంటిస్టులు పిలుస్తున్నారు. 800 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద కూడా ఆ లోహం చెక్కచెదరకుండా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన యూఎస్ ఆర్మీ రిసర్చ్ లేబొరేటరీ, లీహై యూనివర్సిటీ పరిశోధకులు కలిసి క్యుటాలి లోహాన్ని డెవలప్ చేశారు. విమానయాన రంగం, రక్షణ రంగం, పరిశ్రమల అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా హైపర్సోనిక్ మిసైల్స్, హై పెర్ఫార్మెన్స్ టర్బైన్ ఇంజిన్ల తయారీకి ఈ లోహం అనువుగా ఉంటుందని తెలిపారు. కాపర్ లిథియం ప్రెసిపిటేట్స్ను టాంటలిం అణువులతో జతచేయడం ద్వారా హీట్ కండక్టవిటీ గరిష్ఠంగా ఉంటున్నదని, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద లోహ నిర్మాణాన్ని టాంటలం బైలేయర్ స్టెబిలైజ్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఇవీ లాభాలు..
ప్రస్తుతం జెట్ ఇంజిన్లలో నికెల్ సూపర్ అల్లాయ్స్ను వాడుతున్నారని, అయితే.. అత్యధిక ఉష్ణోగ్రతలను ఆ లోహం తట్టుకోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. టంగ్స్టన్ లోహాలు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకున్నా.. చాలా మందంగా ఉండడం వంటి కారణాలతో వాటి తయారీ క్లిష్టంగా మారుతున్నదని పేర్కొన్నారు. వాటికి ఈ క్యుటాలి లోహం ప్రత్యామ్నాయం అవుతుందని వెల్లడించారు.
నెక్స్ట్ జనరేషన్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్కు వీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. కాగా.. 800 డిగ్రీల వేడి వద్ద పదివేల గంటల పాటు ఆ లోహాన్ని టెస్ట్ చేసి చూస్తున్నారు. ఈ లోహానికి అమెరికా పేటెంట్ ను ఇచ్చింది. సైన్యంలో వాడే హీట్ ఎక్స్చేంజర్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, హైపర్సోనిక్ మిసైల్స్ వంటి వాటిలో వినియోగించుకునేందుకు యూఎస్ ఆర్మీ రిసర్చ్ లేబొరేటరీ దీనిపై పేటెంట్ను సంపాదించింది.