హైదరాబాద్లో.. డైలీ ఉప్పల్ టూ ఎంజీబీఎస్ రూట్లో.. జర్నీ చేసేటోళ్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్లో.. డైలీ ఉప్పల్ టూ ఎంజీబీఎస్ రూట్లో.. జర్నీ చేసేటోళ్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున అంబర్ పేట్ ఫ్లై ఓవర్ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 25న ఆయన అధికారులతో కలిసి కొత్తగా నిర్మించిన అంబర్ పేట్ ఫ్లై ఓవర్ను పరిశీలించారు.

నాలుగేండ్ల కింద మొదలైన పనులు ఈ మధ్యే పూర్తయ్యాయి. రూ.445 కోట్లతో గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు 1.625 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్​ ఇది. అయితే భూసేకరణకు కావాల్సిన రూ. 140 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది.

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలయ్యాయి. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట అంచనా వ్యయం రూ.216 కోట్లుగా అనుకున్నారు. ఇందులో రూ.117 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ కాగా, రూ.99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చవుతుందని భావించారు. అయితే, రెండు వర్గాలకు చెందిన కట్టడాలపై నుంచి ఫ్లై ఓవర్​ కట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర రూట్ మార్చడం, భూసేకరణ ఎక్కువ కావడం, టైం కూడా మించి పోవడంతో రూ.445 కోట్ల అంచనాతో రివైజ్ చేశారు. ఇందులో రూ.265 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ ,  రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చయ్యాయి. భూసేకరణ కోసం రూ.140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం  ఇచ్చింది.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్​ వెళ్లేవారితో పాటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. ఇంతకుముందు ఛే నంబర్, శ్రీరమణ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయేది. ఫ్లై ఓవర్​వస్తే చాదర్​ఘాట్ నుంచి సిగ్నల్ తగలకుండా రామాంతాపూర్, హబ్సిగూడ స్ర్టీట్ నెంబర్ 8 వరకు ఈజీగా చేరుకోవచ్చు.