నామమాత్రంగా మనోహరాబాద్​ పీహెచ్​సీ! ..  మంత్రి ఆదేశాలు పట్టించుకోని ఆఫీసర్లు 

నామమాత్రంగా మనోహరాబాద్​ పీహెచ్​సీ! ..  మంత్రి ఆదేశాలు పట్టించుకోని ఆఫీసర్లు 
  • పేరుకు ముగ్గురు డాక్టర్లు..  వైద్య సేవలు మాత్రం అందట్లే.. 

మనోహరాబాద్, వెలుగు :  మెదక్​ జిల్లా మనోహరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పీహెచ్​సీ నామమాత్రంగా మారింది. ముగ్గురు డాక్టర్లను కేటాయించారు కానీ, వారు సరిగా డ్యూటీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి హెల్త్​ మినిస్టర్​జిల్లాలో, సీఎం నియోజకవర్గంలో నెలకొనడం గమనార్హం. తూప్రాన్ డివిజన్ కేంద్రంలో 50 బెడ్ ల గవర్నమెంట్ హాస్పిటల్ ను ప్రారంభించడంతో అక్కడున్న పీహెచ్​సీని మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు రెండేండ్లు పోరాటం చేశారు. దీంతో హెల్త్​  మినిస్టర్​ హరీశ్​రావు ఆదేశాలతో తూప్రాన్​ పీహెచ్​సీని మనోహరాబాద్ కు  షిఫ్ట్ చేశారు.

అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ఆనంద్  తోపాటు స్టాఫ్​ను మనోహరాబాద్ పీహెచ్​సీకి బదిలీ చేశారు. ఈ మండలంలోని 17 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కొత్తగా మరో ఇద్దరి డాక్టర్లను ఈ పీహెచ్​సీకి అలాట్​చేశారు.  అయితే డాక్టర్ ఆనంద్ లాంగ్​ లీవ్​ పెట్టి మూడు నెలల నుంచి హాస్పిటల్ కు రావడం లేదు. మిగతా డాక్టర్లు షిఫ్టుల వారీగా విధులకు హాజరవుతుండటంతో పీహెచ్​సీకి వస్తున్న రోగులకు సరైన సేవలందడం లేదు. చాలా సందర్భాల్లో వెయిటింగ్​ చేసి డాక్టర్​ రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా  సంబంధిత ఆఫీసర్లు  పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పీహెచ్​సీలో సరైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.