
- అందుబాటులో 140 రకాల వైద్య పరీక్షలు
- త్వరలోనే సీటీ స్కాన్, ఇతర సేవలు
- సిబ్బంది కొరతతో ఇబ్బందులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్(టీ హబ్ ) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు శనివారం హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన వెంటనే ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్ టీ హబ్ను ఓపెన్ చేశారు. ఇక్కడ వివిధ రకాలైన బ్లడ్, యూరిన్ టెస్టులతో పాటు డిజిటల్ ఎక్స్రే, సీటీ స్కానింగ్, మోమోగ్రామ్ తదితర 140 రకాల సర్వీసులను అందించనున్నారు. ప్రస్తుతం అన్ని రకాల బ్లడ్, యూరిన్ టెస్టులు నిర్వహిస్తామని, క్రమంగా పూర్తిస్థాయి సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.
రూ.1.25 కోట్లతో ఏర్పాటు....
రోగులకు అన్ని రకాల బ్లడ్, యూరిన్ టెస్టులు, ఎక్స్రే, స్కానింగ్ వంటి సేవలను ఒకే దగ్గర అందించడానికి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో టీ హబ్లను శాంక్షన్ చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల కాలేజీ రోడ్లో రూ.1.25 కోట్లతో టీ హబ్ను ఏర్పాటు చేశారు. దీనికోసం కొత్తగా 17 రూములతో డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ను నిర్మించారు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ర్టీ ల్యాబ్లు, పాథాలజీ, డ్రైస్టోర్, కోల్డ్స్టోర్, కన్సల్టేషన్, 2డీ ఎకో, ఈసీజీ, యూఎస్జీ, సీఆర్, సీటీ స్కాన్, ఎక్స్రే, మామోగ్రఫీల కోసం రూములను కేటాయించారు. సంబంధిత మెషీన్లను ఇన్స్టాలేషన్ చేశారు. సీటీ స్కాన్, టుడీ ఎకో మెషీన్లు మాత్రం ఇంకా రాలేదు.
140 రకాల వైద్య పరీక్షలు....
టీ హబ్లో బ్లడ్, యూరిన్ టెస్టులు, ఎక్స్రే, స్కానింగ్, మొమోగ్రామ్ తదితర 140 రకాల వైద్య పరీక్షలను అందించనున్నారు. డయాబెటిక్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, రేనల్ ఫంక్షన్, సీరం ఎలక్ర్టోలైట్స్, సీబీపీ, మైక్రోబయాలజీలో కలిపి 57 రకాల టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. మహిళల రొమ్ము క్యాన్సర్కు సంబంధించి మోమోగ్రాఫ్, అల్ర్టాసౌండ్, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే సేవలు అందనున్నాయి. ఈ టెస్టులను ప్రైవేట్ ల్యాబ్లలో చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతాయి. టీ హబ్లో అన్ని టెస్టులను ఉచితంగానే చేస్తారు. అలాగే జిల్లాలోని 17 పీహెచ్సీలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు బస్తీ దవాఖానాలతో పాటు పల్లె దవాఖానాలు, సీహెచ్సీలకు వచ్చే పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి టీ హబ్లో టెస్టులు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా శాంపిల్స్ తరలించడానికి నాలుగు వెహికల్స్అవసరం కాగా, ప్రస్తుతం రెండు మాత్రమే వచ్చాయి.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీ హబ్లను ఏర్పాటు చేసినప్పటికీ అవసరమైన డాక్టర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో పనిచేస్తున్న తొమ్మిది మంది ల్యాబ్ టెక్నీషియన్లను డిప్యూటేషన్పై టీ హబ్ కు కేటాయించారు. రేడియోగ్రాఫర్లు, రేడియాలజిస్టులు, మైక్రోబయాలజిస్టుల కొరత ఉంది. ఈ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు రాలేదు. దీంతో మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
మెరుగైన సేవలు అందిస్తాం...
మంచిర్యాలలో టీ హబ్ఏర్పాటుతో పేదలకు మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగానే అందుబాటులో వచ్చాయి. మొత్తం 140 రకాల సేవలకు గాను ప్రస్తుతం అన్ని రకాల బ్లడ్ టెస్టులకు ఏర్పాట్లు చేశాం. పూర్తిస్థాయిలో సేవలందించడానికి అవసరమైన సిబ్బందిని, టెక్నీషియన్లు, డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం.
డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్