జనాభా లెక్కల్లోనే కులగణన: కేంద్రం సంచలన నిర్ణయం..

జనాభా లెక్కల్లోనే కులగణన: కేంద్రం సంచలన నిర్ణయం..

భారతదేశంలో జనం ఎంత మంది.. ఆ జనంలో ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు.. ఈ విషయాలు అన్నింటినీ త్వరలోనే తేల్చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్. 2025, ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం.. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ (CCPA)లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన. త్వరలోనే జనాభా లెక్కలు జరగబోతుందని.. అందులోనే కుల గణన కూడా చేయనున్నట్లు స్పష్టం చేశారాయన. కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారాయన.

బుధవారం ( ఏప్రిల్ 30 ) జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ కు ఎట్టకేలకు ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కులగణన పేరుతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్వే చేయించిందని.. ఆయా రాష్ట్రాల సర్వేలో పారదర్శకత లేదని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కులాల అసలు సంఖ్య జనాభా లెక్కల్లో తేలుతుందని అన్నారు. 

భారతదేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు తీశారు. ఆ తర్వాత పదేళ్లకు అంటే.. 2021లో మళ్లీ జన గణన జరగాల్సి ఉంది. ఆ సమయంలో కరోనా రావటంతో వాయిదా వేశారు. 2025లో జనాభా లెక్కలు లెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలోనే జనాభా లెక్కల్లోనే కుల గణన చేపట్టాలని.. ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారో తీసుకోవాలంటూ.. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ డిమాండ్ కు అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కుల గణన చేపట్టారు. ఈ రిపోర్ట్ ఆమోదించాలని కేంద్రానికి పంపించారు. దేశ వ్యాప్తంగా జన గణనతోపాటు.. కుల గణన చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ కు.. ఇప్పుడు కేంద్రం ఓకే చెప్పింది. జన గణన ఎప్పుడు చేపడితే అప్పుడు.. అదే డేటాలో.. కుల గణన కూడా ఉంటుందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.