
- గతేడాది బీహార్లో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్
- దర్యాప్తులో భాగంగా సోదాలు
హైదరాబాద్, వెలుగు: నకిలీ నోట్ల తయారీకి సంబంధించి నమోదైన కేసుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. గతేడాది బీహార్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, జమ్మూ అండ్ కశ్మీర్, బీహార్లో బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని అనుమానితుల ఇండ్లలో తనిఖీలు చేసింది.
ఈ సోదాల్లో రూ.1.5 లక్షలు నగదు, పెన్ డ్రైవ్ లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులతోపాలు పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల వివరాలను ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. బీహర్ కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న భగల్పూర్కు చెందిన నాజర్ సద్దాం, భోజ్పూర్కు చెందిన వరీస్, పట్నాకు చెందిన జాకీర్ హుస్సేన్ను గతేడాది సెప్టెంబర్ 5న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
నేపాల్కు చెందిన నిందితులు నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా బీహార్లోని పట్నా, భగల్పూర్, భోజ్పూర్, మోతిహారి జిల్లాలు సహా హైదరాబాద్, జమ్మూ అండ్ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాల్లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.