చట్టాల్లో లొసుకుల్ని పట్టుకుని రోజుకో పిటిషన్తో ముందుకొస్తున్నారు నిర్భయ రేప్, మర్డర్ కేసు దోషులు. ఉరి శిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చిన పవన్ గుప్తా పిటిషన్ వరకూ పెద్ద హైడ్రామానే నడిపిస్తున్నారు.
ఢిల్లీలో 2012 డిసెంబరు 16న నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసే సమయానికి తాను మైనర్నని, తనకు ఐపీసీ ప్రకారం ఉరి తీయడం కుదరదంటూ పిటిషన్ వేశాడు దోషుల్లో ఒకడైన పవన్. జువెనైల్ చట్టం ప్రకారం ఏ దశలోనైనా మైనారిటీని రుజువు చేసుకునేందుకు కోరే అవకాశం ఉంది. దీంతో ఆ లూప్ హోల్ను అడ్డం పెట్టుకుని మరికొద్ది రోజుల్లో ఉరి ఖాయం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నేరం చేసిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు మెట్లెక్కాడు.
ఇవాళ ఉదయం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. తొలుత దోషి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. మైనర్ అని నిరూపించుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లను దాఖలు చేసేందుకు టైమ్ కావాలని కోరడంతో ఏకంగా జనవరి 24 వరకు విచారణను వాయిదా వేసింది కోర్టు. దీనిపై నిర్భయ తరఫు న్యాయవాది తీవ్ర ఆవేదనతో నిరసనకు దిగారు. ఈ వాయిదాను రద్దు చేయాలని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు దిగి వచ్చింది. ఈ రోజే విచారణ జరిపేందుకు నిర్ణయించింది. వాయిదా వేస్తూ ఇచ్చిన ఆర్డర్ను రీకాల్ చేసింది. విచారణ తర్వాత జువెనైల్ అని తేలితే అతడు మూడేళ్ల జైలు శిక్షతో తప్పించుకునే అవకాశం ఉందని, కాదని తేలితే మరణ శిక్ష తప్పదని తెలుస్తోంది.