
నిర్మల్, వెలుగు: కొత్త పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఆలింకో సంస్థ సహకారంతో 91 మందికి రూ.7.70 లక్షల విలువైన 133 ఉపకరణాలు వీల్ చైర్లు, శ్రవణ, దృశ్య, తదితర పరికరాలను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులకు ప్రభుత్వం ఉపకరణాలు అందిస్తోందన్నారు.
భవిత సెంటర్ ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవితంలో అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ఉపకరణాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, దివ్యాంగులు నిత్యజీవితంలో అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పి.రామారావు, ఎంఈవో నాగేశ్వర్ రావు, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.