
- మూడు సెగ్మెంట్లలో పోటాపోటీగా అప్లికేషన్లు
- టికెట్ మాకంటే మాకంటూ ప్రచారం
- క్యాడర్లో అయోమయం
- 11న జరిగే సమావేశంపైనే అందరి దృష్టి
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కాంగ్రెస్లో లీడర్ల లొల్లి రచ్చకెక్కుతున్నది. టికెట్ల కోసం పోటాపోటీగా అప్లై చేసుకున్న నేతలు, నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా టికెట్ మనకే వస్తుందని, ఎవరూ ఎటూ వెళ్లవద్దని చెప్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. ఒక్క నిర్మల్నియోజకవర్గంలో పరిస్థితి కొంత బెటర్గా ఉన్ప్పటికీ ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో క్యాడర్ను సమన్వయం చేసే లీడర్లు లేక అంతా గందరగోళంగా తయారైంది. ఈ క్రమంలో ఈ నెల 11న నిర్మల్ కేంద్రంగా పార్లమెంట్నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనుండడం ఆసక్తి రేపుతోంది.
ఒకరిపై ఒకరు విమర్శలు..
నిర్మల్ జిల్లాలో నేతల నడుమ సమన్వయం లోపిం చింది. పెద్దసంఖ్యలో టికెట్ల కోసం అప్లై చేసుకున్న నేతలు ఆధిపత్య పోరులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు.. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదురుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో పరిస్థితి మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 17న హైదరాబాద్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జిల్లా నుంచి సుమారు 30 వేల మందిని సమీకరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పరిస్థితి ఇట్లా ఉంటే జన సమీకరణ చేసేదెట్ల అని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.
నిర్మల్ సెగ్మెంట్ నుంచి శ్రీహరి రావు తో పాటు సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ లాయర్ అల్లూరి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రాజేశ్వర్,సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వెంబడి రాజేశ్వర్ టికెట్ల కోసం అప్లై చేసుకున్నారు. కాగా, రేవంత్ రెడ్డి శ్రీహరి రావు కు టికెట్పై ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని రాజేశ్వర్ రెడ్డి, న్యాయవాది మల్లారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఖాయం కాకముందే ఎలా చెప్పుకొని తిరుగుతారని మండిపడ్తున్నారు.
ముథోల్లో డాక్టర్ కిరణ్ కుమార్, సీనియర్ నాయకుడు ఆనందరావు పటేల్, మాజీ జెడ్పీటీసీ విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్రీహరిరావు తమ నియోజక వర్గంలో వేలుపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ జడ్పీటీసీ విజయ్కుమార్రెడ్డి ఆయనపై బహిరంగ విమ ర్శలు చేశారు.
మరోవైపు ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా15 మందికి పైగా లీడర్లు అప్లై చేసుకోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో ఇక్కడ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
ముఖ్యంగా ఆదివాసీ తెగకు చెందిన వెడుమ బొజ్జు తో బాటు సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మధ్య నువ్వా? నేనా? అనే పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నారు. వీరిద్దరి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. నిజానికి రేఖా నాయక్ కు టికెట్ కేటాయిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని సీనియర్లు అంటున్నారు. రేఖకు టికెట్ ఇవ్వవద్దంటూ ఇప్పటికే హైకమాండ్కు లెటర్లు రాస్తున్నారు. వీరిద్దరితో పాటు పార్టీ సీనియర్ నాయకులు చారులత, భరత్ చౌహన్, వినోద్ నాయక్, కిషోర్ నాయక్, సునీల్, బాపూరావు, బక్షి నా యక్, రామకృష్ణ నాయక్, రాములు నాయక్, పెందూరు ప్రభాకర్, కోట్నాక ర మేష్ తదితరులు కూడా టికెట్రేసులో ఉండడం గమనార్హం.
సమన్వయం సాధ్యమయ్యేనా?
ఈ మూడు సెగ్మెంట్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఈనెల 11న పార్లమెంట్ నియో జక వర్గ స్థాయి సమావేశాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి నాయకులతో పాటు కర్ణాటక కు చెందిన ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి ప్రకాష్ రాథోడ్ హాజరుకానున్నారు.
ఈయన ఇక్కడి నేతలు, కార్యకర్తలతో చర్చించి అందరూ ఏకతాటిపై నిలిచేలా దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ సమావేశం తర్వాతైనా నేతల మధ్య సమన్వయం సాధ్యమవుతుందా? లేదా? అని క్యాడర్లో చర్చ జరుగుతోంది.