
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. 2023, నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపల్లిలో పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఓటు వేసేందుకు ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొని బూత్ లోకి వెళ్లారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆయనపై ఎలక్షన్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.